ఇవేం అప్పులు?

ABN , First Publish Date - 2022-03-16T08:40:26+05:30 IST

వాస్తవ అంచనాలకు దూరంగా రాష్ట్ర బడ్జెట్‌ ఉందని, అప్పులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

ఇవేం అప్పులు?

రాష్ట్రంపై కేంద్రం వివక్ష : భట్టి 

హైదరాబాద్‌, మార్చి 15(ఆంధ్రజ్యోతి): వాస్తవ అంచనాలకు దూరంగా రాష్ట్ర బడ్జెట్‌ ఉందని, అప్పులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో మంగళవారం ఆయన మాట్లాడారు. ‘‘అప్పులలో 90 శాతం పెట్టుబడి వ్యయంగా పెడుతున్నారని చెబుతున్నారు. కానీ, 2022-23లో అప్పులు రూ.52 వేల కోట్లుగా, పెట్టుబడి వ్యయం రూ.29వేల కోట్లుగా మాత్రమే చూపించారు. ఇది 90 శాతం ఎలా అవుతుంది’’ అని ప్రశ్నించారు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కూడా అధ్వానంగా ఉందని, రూ.41 వేల కోట్లు చూపించారని, కేంద్రం నుంచి రూ.10 వేల నుంచి రూ.15 వేల కోట్లు దాటడం లేదని పేర్కొన్నారు. బడ్జెట్‌లోని రూ.60 వేల కోట్ల లెక్కల్లో వ్యత్యాసం ఉందని, దీని ద్వారా సంక్షేమ కార్యక్రమాలకు ప్రతిపాదించిన పనులు చేపట్టకపోతే పేదలే నష్టపోతారని భట్టి పేర్కొన్నారు. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందని భట్టి పేర్కొన్నారు. దేశంలో 171 మెడికల్‌ కాలేజీలు, 84 నవోదయ స్కూళ్లను మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రం అప్పు రూ.4.70 లక్షల కోట్లుందని 2024-25 నాటికి రూ.5 లక్షల కోట్లు దాటడం ఖాయమన్నారు. ఆర్‌ఎ్‌సఎస్‌ వాళ్లు గాంధీజీని కాల్చి చంపారని భట్టి మండిపడ్డారు. ‘‘వాళ్లే ఈ రోజు దేశాన్ని పాలిస్తున్నారు. గాంధీని జాతిపితగా పిలుస్తున్నాం. మరోవైపు గాడ్సేను దేవుడిగా కొలిచే పార్టీ దేశాన్ని పాలిస్తోంది’’ అని మండిపడ్డారు.

Updated Date - 2022-03-16T08:40:26+05:30 IST