కేంద్ర ప్రభుత్వం తాజా అడ్వైజరీ...
ABN , First Publish Date - 2020-04-05T20:10:44+05:30 IST
దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లలో ఉంటూనే ప్రజలు శారీరకంగా, మానిసికంగా దృఢ చిత్తులు కావాలని కేంద్ర ప్రభుత్వం తాజా అడ్వైజరీలో ..
న్యూఢిల్లీ: దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లలో ఉంటూనే ప్రజలు శారీరకంగా, మానిసికంగా దృఢ చిత్తులు కావాలని కేంద్ర ప్రభుత్వం తాజా అడ్వైజరీలో ప్రజలను కోరింది. ప్రజలు ఆన్లైన్ క్లాసులకు హాజరుకావాలని, మంచి పుస్తకాలు చదువుతూ, వినోదాన్ని అందించే సినిమాలు చూస్తూ, ధ్యానం, డాన్సులు, సంగీతం వినడం ద్వారా ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మానసిక, శారీరక ఉల్లాసం పొందాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కోరింది. లాక్డౌన్ కారణంగా జిమ్లు, పార్కులు మూతపడటంతో ప్రజలు ఇళ్లకే పరమితమవుతున్నారు.
ఇళ్లల్లోంచి రావద్దు...
ఏప్రిల్ 8,9 తేదీల్లో షాబ్-ఇ-బారత్ జరుపుకునేందుకు ఇళ్లలోంచి బయటకు రావద్దని ఢిల్లీ పోలీసులు కోరారు. లాక్డౌన్ను పాటించే విషయంలో మతనాయకులు, ఆర్డబ్ల్యూఏ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
హెల్త్ వర్కర్లపై దాడి...
కాగా, తమిళనాడులోని తూత్కుకుడిలో హెల్త్ వర్కర్లపై స్థానికులు దాడికి దిగినట్టు కథనాలు వెలువడుతున్నాయి. కోవిడ్-19 కేసుల గురించి ఆరా తీసేందుకు హెల్త్ వర్కర్లు కోవిల్పట్టిలో ఇంటింటికి వెళ్లి సమచారం రాబడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు చెబుతున్నారు.