కేంద్రం విధానాలు సరికాదు
ABN , First Publish Date - 2020-09-24T06:58:17+05:30 IST
ప్రభుత్వరంగ సంస్థలైన ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ తదితర రంగాలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 23: ప్రభుత్వరంగ సంస్థలైన ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ తదితర రంగాలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు సరికాదని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సంకె రవి, ఇఫ్టూ జిల్లా కార్యదర్శి టి. శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఐక్య యూనియన్ల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఏఓ సురేష్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రధాని మోదీ కార్పొరేట్ సంస్థలకు ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఎఫ్డీఐని 100 శాతం అనుమతిస్తూ దేశ సహజ సంపదలను కొల్లగొట్టే కార్పొరేట్లకు కారుచౌకగా సంస్థలను అప్పగిస్తూ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీఎస్ఎన్ఎల్లో 66 వేల మందికి ఉద్వాసన పలికి అన్యాయం చేశారని అన్నారు. టెలికాం రంగాన్ని రిలయన్స్ కంపెనీకి ధారాదత్తం చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా ఈ చర్యలను మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఖలీందర్ ఖాన్, రామడుగు లక్ష్మణ్, మిట్టపల్లి పౌల్, వీబీ రావు, సీఐటీయూ నాయకులు మిడవెల్లి శంకర్, దాసరి రాజేశ్వరి, ఇఫ్టూ నాయకులు తోకల తిరుపతి, బ్రహ్మానందం పాల్గొన్నారు.