సంక్షేమ పథకాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
ABN , First Publish Date - 2022-01-20T04:53:46+05:30 IST
సంక్షేమ పథకాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు.
- ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
రాయికల్, జనవరి 19: సంక్షేమ పథకాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. మండలంలోని తాట్లవాయి గ్రామంలో బుధవారం కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప రైతులకు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫోస్టోలో ప్రకటించిన విధంగా దళితులకు మూడెకరాల భూమి, నిరుపేదలకు డబల్బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం వంటి మాటలు నీటి మూటలయ్యాయని విమర్శించారు. 55ఏళ్ల ఉమ్మడి రాష్ట్ర పాలనలో 60వేల కోట్ల అప్పులు ఉంటే ఏడేళ్ల తెలంగాణాలో 4లక్షల కోట్ల అప్పులు అయ్యాయని అన్నారు. కేంద్రంలో బీజేపీ పాలనలో పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను కార్యకర్తలు ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అఽధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్రావు, మహేంధర్గౌడ్, నాయకులు గోపిరాజరెడ్డి, కోసరి మహేష్, మండ రమేష్, సుధాకర్రెడ్డి, సంతోష్, నరేష్, మల్లయ్య, శేఖర్రెడ్డి, మంగీలాల్ పాల్గొన్నారు.