వాతావరణాన్ని కలుషితం చేసే ల్యాబోరేటరీ కాంగ్రెస్ : నఖ్వీ ఫైర్
ABN , First Publish Date - 2020-06-06T23:06:34+05:30 IST
కరోనా మహమ్మారి విషయంలో ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మండిపడ్డారు. లాక్డౌన్ విఫలమైందన్న కాంగ్రెస్
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విషయంలో ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మండిపడ్డారు. లాక్డౌన్ విఫలమైందన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. రాజకీయ వాతావరణాన్ని ఆయన కలుషితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారంలో భాగస్వాములైతే బాగుంటుంది కానీ... అంతరాయం సృష్టించరాదని రాహుల్కు ఆయన హితవు పలికారు.
‘‘ఈ మహమ్మారి సమయంలో రాజకీయ కలుషితాన్ని పరివ్యాప్తం చేసే ల్యాబోరేటరీ కాంగ్రెస్ పార్టీ. కరోనా సమయంలో కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. సమస్య పరిష్కారంలో భాగస్వాములు కావాలని వారు భావించడం లేదు. రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయాలనే చూస్తున్నారు’’ అని తీవ్రంగా ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం బోధపడని విషయాల్లో తమకు తాము అనుభవజ్ఞులమని ప్రకటించుకుంటారని ఎద్దేవా చేశారు. ‘‘లాక్డౌన్ను విధించిన సమయంలో ఎందుకు విధించామో చెప్పారు. ఇప్పుడు మాత్రం ఎందుకు ఎత్తేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి ఏదీ అర్థం కాదు. అదీ సమస్య. కానీ వారికి వారు అనుభవజ్ఞులమని ప్రచారం చేసుకుంటారు.’’ అని నఖ్వీ ఎద్దేవా చేశారు.