YS JAGAN సర్కార్‌‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం

ABN , First Publish Date - 2021-07-10T18:47:20+05:30 IST

తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ స్పందించి జగన్ సర్కార్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది.

YS JAGAN సర్కార్‌‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం

అమరావతి : రాష్ట్ర ఖజానా నుంచి రూ.41,043 కోట్లకు సంబంధించి ఖర్చుల వివరాలు లేవంటూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు టీడీపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ నిధులకు సంబంధించి ఎలాంటి గోల్‌మాల్‌ జరగలేదని, ఆ మొత్తాన్ని బడ్జెట్‌ ఖాతా నుంచి వివిధ కార్పొరేషన్ల పీడీ ఖాతాలకు మళ్లించి ఖర్చు చేసినట్టు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ వివరణ ఇచ్చారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్య కార్యదర్శి స్పందించి క్లారిటీ ఇవ్వగా తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ స్పందించి జగన్ సర్కార్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది.


కేంద్రం ఏమన్నది..!?

రుణపరిమితికి మించి ఏపీ ప్రభుత్వం డబ్బులు వాడేసుకున్నదని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు.. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటి రూ.17 వేల కోట్లు అదనంగా వాడుకున్నట్లు కూడా ఏపీ ఆర్థికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి కేంద్ర ఆర్థికశాఖ లేఖ ద్వారా తెలిపింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖను పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్ మీడియాకు విడుదల చేశారు. లేఖలో ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం గట్టిగా హెచ్చరించింది. అదనంగా వాడుకున్న 17వేల కోట్లను ఈ ఆర్థిక సంవత్సరంలో సర్దుబాటు చేస్తామని కేంద్రం తెలిపింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి అదనంగా అప్పు తేవడం చట్టవిరుద్ధమని ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం తప్పుబట్టింది. తాము పంపిన లెక్కల్లో తేడాలుంటే తెలియజేయాలని ఏపీని కేంద్రం ఆదేశించింది.


కేంద్రం లేఖపై స్పందించండి..

రాష్ట్ర ఆర్థికశాఖ అస్తవ్యస్థ విధానాలపై పయ్యావుల తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్ధికశాఖకు కేంద్రం రాసిన మరో లేఖను కూడా ఆయన మీడియా ముఖంగా విడుదల చేశారు. పరిమితికి మించి రూ.17,923.94 కోట్ల అప్పులు చేశారంటూ లేఖలో కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిందన్న విషయాన్ని పయ్యావుల తెలిపారు. కేంద్రం లేఖతో రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని స్పష్టమైందని.. రాష్ట్రం చేసే ఆర్ధిక తప్పిదాలపై కేంద్రానికి సమాధానం చెప్పాల్సిందేనని పయ్యావుల చెప్పుకొచ్చారు. అయితే.. నిన్న స్పందించిన ముఖ్య కార్యదర్శి ఈ లేఖ విడుదల చేసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారు..? జగన్ సర్కార్‌ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాలి.

Updated Date - 2021-07-10T18:47:20+05:30 IST