నిర్భయ దోషుల ఉరిశిక్ష స్టేను సవాల్ చేసిన కేంద్రం

ABN , First Publish Date - 2020-02-03T01:23:10+05:30 IST

నిర్భయ హత్యాచారం కేసులో దోషుల ఉరిశిక్షపై పటియాలా కోర్టు విధించిన స్టేను కేంద్రప్రభుత్వం సవాల్ చేసింది.

నిర్భయ దోషుల ఉరిశిక్ష స్టేను సవాల్ చేసిన కేంద్రం

నిర్భయ హత్యాచారం కేసులో దోషుల ఉరిశిక్షపై పటియాలా కోర్టు విధించిన స్టేను కేంద్రప్రభుత్వం సవాల్ చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. కేంద్రం తరఫున సొలిసిటర్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ దోషులకు విడివిడిగా ఉరిశిక్ష అమలు చేయడానికి అనుమతినివ్వాలని ఆయన కోరారు. న్యాయవ్యవస్థలోని అంశాలను ఒకరి తర్వాత ఒకరుగా ఉపయోగించుకొంటున్న దోషులు కావాలనే శిక్ష అమలు కాకుండా జాప్యం జరిగేలా చేస్తున్నారని ఆయన అన్నారు.

ఈ విషయంలో చట్టం దుర్వినియోగం అవుతోందని, ఇలాగైతే ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం పోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. క్షమాభిక్ష తిరస్కరణకు గురైన దోషులిద్దరికీ వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని కోరారు. కాగా, ఎప్పట్లాగే నిందితుల తరపున ఏపీ సింగ్ వాదనలు వినిపించారు. గత సుప్రీం తీర్పు, జైలు మాన్యువల్ ప్రకారం వీరికి ఉరి వేయడానికి వీల్లేదని ఆయన వాదించారు. ఈ పిటిషన్‌పై విచారణ అనంతరం నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడారు. ఇరువైపు వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేశారని, కోర్టు తీర్పుతో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2020-02-03T01:23:10+05:30 IST