పబ్జీ ఇప్పట్లో లేనట్లే..!
ABN , First Publish Date - 2021-01-26T15:51:15+05:30 IST
బ్యాన్ అయి 6 నెలలు గడిచిపోయింది. మొదట్లో 2020 డిసెంబరులోనే తిరిగి వస్తుందన్నారు. ఆ తరువాత 2021 జనవరిలో వస్తుందని పుకార్లు వినిపించాయి. ఆ తరువాత మార్చిలో వస్తుందన్నారు. కానీ ఇప్పుడు కేంద్రం వైఖరి చూస్తుంటే ఆ ఆశలు కూడా గల్లంతవుతున్నట్లే..
ఇంటర్నెట్ డెస్క్: బ్యాన్ అయి 6 నెలలు గడిచిపోయింది. మొదట్లో 2020 డిసెంబరులోనే తిరిగి వస్తుందన్నారు. ఆ తరువాత 2021 జనవరిలో వస్తుందని పుకార్లు వినిపించాయి. ఆ తరువాత మార్చిలో వస్తుందన్నారు. కానీ ఇప్పుడు కేంద్రం వైఖరి చూస్తుంటే ఆ ఆశలు కూడా గల్లంతవుతున్నట్లే కనిపిస్తున్నాయి. ఇదంతా దేనిగురించి అనుకుంటున్నారా.. ఇంక దేని గురించి పబ్జీ గురించి. అవును చైనా అప్లికేషన్లపై కేంద్రం నిషేధం విధించిన తరవాత రెండో దశలో పబ్జీని కూడా బ్యాన్ చేసింది. అప్పటి నుంచి ఈ గేమ్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని పిల్లలు, యువత ఎదురు చూస్తున్నారు. కానీ వారందరి ఆశలను అడియాశలు చేస్తూ కేంద్రం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం చైనా తదితర అప్లికేషన్లపై బ్యాన్ మార్చి నాటికి తొలగించే ప్రసక్తే లేదని, సమీప భవిష్యత్తులో ఆ ఆలోచనే తమకు లేదని కేంద్రం ప్రకటించింది. దీంతో మరో రెండు నెలల్లో కచ్చితంగా పబ్జీ తిరిగొస్తుందని భావిస్తున్న యువత గుండెల్లో పిడుగు పడినట్లవుతోంది.
ఓ ప్రముఖ వెబ్సైట్లో వస్తున్న వార్తల ప్రకారం.. టిక్టాక్తో పాటు ఇతర చైనా అప్లికేషన్లపై విధించిన నిషేధం ప్రస్తుత కాలంలో తొలిగించే ఆలోచన ఏమాత్రం లేనట్లు కేంద్ర సర్కార్ చెబుతోందట. దీంతో పబ్జీ మొబైల్ యాజమాన్యంతో పాటు ఆ గేమ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న వారికి కూడా నిరాశే మిగిలినట్లైంది. గతేడాది జూన్లో కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా చైనా అప్లికేషన్లను బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతలో 59 అప్లికేషన్లలను బ్యాన్ చేసింది. అందులో పాపులర్ షార్ట్ వీడియో సోషల్ మీడియా అప్లికేషన్ టిక్టాక్ కూడా ఉంది. ఇక సెప్టెంబరులో రెండో విడతగా మళ్లీ 118 అప్లికేషన్లను కేంద్రం బ్యాన్ చేసింది. అందులో పబ్జీ మొబైల్ గేమ్తో పాటు ఇంకా అనేక యాప్లున్నాయి. ఈ అప్లికేషన్లు భారతీయుల గోప్య సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ అప్లికేషన్లన్నింటినీ బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.