వలసల సంక్షోభంపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్

ABN , First Publish Date - 2020-06-07T00:10:12+05:30 IST

కోవిడ్-19 సంక్షోభం కారణంగా వలస కార్మికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తీసుకున్న చర్చలను కేంద్ర వివరిస్తూ సుప్రీంకోర్టులో..

వలసల సంక్షోభంపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్

న్యూఢిల్లీ: కోవిడ్-19 సంక్షోభం కారణంగా వలస కార్మికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తీసుకున్న చర్చలను కేంద్ర వివరిస్తూ సుప్రీంకోర్టులో శనివారంనాడు అఫిడవిట్ దాఖలు చేసింది. వలస కార్మికుల అగచాట్లను సుమోటాగా తీసుకుని సమాధానం ఇవ్వాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించడంతో కేంద్రం ఈ అఫిడవిట్ సమర్పించింది.


వలస కార్మికులను సురక్షితంగా తరలించేందుకు ఎన్‌హెచ్ఏఐ సహకారం తీసుకున్నామని, రోడ్లపై కాలినడకన వెళ్తూ కనిపించిన వారిని సమీపంలోని రైల్వే స్టేషన్లకు పంపేందుకు అవసరమైన సౌకర్యాలను కల్పించామని అఫిడవిట్‌లో కేంద్రం తెలిపింది. 'ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయ బద్ధంగా, కేంద్ర, రాష్ట్ర స్థాయిలో సంప్రదింపులు, అన్ని రంగాల్లో నిపుణులైన వారి సలహాలు తీసుకుంది' అని కేంద్రం తెలిపింది.


వలస కార్మికులకు ఆహారం, మంచినీరు, మందులు, బట్టలు, చెప్పులు, ఇతర నిత్యావసరాలను వారి వారి అవసరాలను బట్టి కేంద్రం అందించినట్టు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వేలు ఆహారం, నీటిని ఉచితంగా అందించాయని వివరించింది. జూన్ 1వ తేదీ వరకూ రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సేవలతో పాటు రైల్వేలు 1.63 కోట్ల ఖర్చుతో ఆహారం, 2.10 కోట్ల ఖర్చుతో వాటర్ బాటిళ్లు అందించినట్టు తెలిపింది. కోవిడ్ మహమ్మారి నుంచి విలువైన ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందువరుసలో నిలవగా, యావద్దేశం యుద్ధ ప్రాతిపదికన స్పందించినట్టు అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది.

Updated Date - 2020-06-07T00:10:12+05:30 IST