ఆందోళనకరంగా ఆ నాలుగు నగరాలు
ABN , First Publish Date - 2020-08-01T08:40:20+05:30 IST
దేశంలో ప్రస్తుతం హైదరాబాద్, పుణే, థానే, బెంగళూరు నగరాల పరిస్థితే ఆందోళన కలిగిస్తోందని,
హైదరాబాద్, పుణే, థానే, బెంగళూరుల్లో వేగంగా వైరస్ వ్యాప్తి: హర్షవర్దన్
న్యూఢిల్లీ, జూలై 31: దేశంలో ప్రస్తుతం హైదరాబాద్, పుణే, థానే, బెంగళూరు నగరాల పరిస్థితే ఆందోళన కలిగిస్తోందని, అక్కడ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ అన్నారు. అదే సమయంలో ఢిల్లీ వేగంగా కోలుకుంటోందని, 89 శాతం రికవరీ రేటుతో అది దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందని వ్యాఖ్యానించారు. దేశంలోని కరోనా పరిస్థితిపై శుక్రవారం ఇక్కడ వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులతో ఆయన అధ్యక్షతన ఓ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో హర్షవర్దన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల్లో 0.28% రోగులు మాత్ర మే వెంటిలేటర్లపై ఉన్నారని తెలిపారు. 1.61% ఐసీయూల్లో, 2.32% రోగులు ఆక్సిజన్ సపోర్ట్ బెడ్లపై ఉన్నారని వెల్లడించారు. దేశంలో ఇప్పటివరకు పది లక్షల మందికి పైగా రోగు లు కరోనా నుంచి కోలుకున్నారన్నారు. రికవరీ రేటు 64.54 శాతంగా ఉందని, కేసుల రెట్టింపు వ్యవధి 21 రోజులుగా ఉందన్నారు. 33.27% మంది రోగులు మాత్రమే వైద్య పర్యవేక్షణలో ఉన్నారని, ఇది మొత్తం పాజిటివ్ కేసుల్లో మూడో వంతేనని వివరించారు. మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుతోందన్నారు. మరణాల రేటులో 2.18 శాతంతో భారత్.. ప్రపంచంలో అతి తక్కువ మరణాల రేటు కలిగిన దేశాల్లో ఒకటిగా నిలిచిందని హర్షవర్దన్ తెలిపారు. కాగా, గడచిన 24 గంటల్లో దేశంలో 6 లక్షలకు పైగా టెస్టులు నిర్వహించామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.