కరోనాపై పోరాటానికి రూ.15,000 కోట్లు ప్రకటించిన కేంద్రం

ABN , First Publish Date - 2020-04-10T00:46:58+05:30 IST

కోవిడ్-19పై పోరాటానికి రూ.15,000 కోట్లు మంజూరు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 'ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్‌నెస్ ప్యాకేజీ' కింద ..

కరోనాపై పోరాటానికి రూ.15,000 కోట్లు ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ: కోవిడ్-19పై పోరాటానికి రూ.15,000 కోట్లు మంజూరు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 'ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్‌నెస్ ప్యాకేజీ' కింద ఈ మొత్తాన్ని ప్రకటించింది. ఇందులో రూ.7,774 కోట్లు తక్షణ కోవిడ్-19 స్పందన చర్యల కోసం ఖర్చు చేయనుండగా, తక్కిన మొత్తాన్ని మిషన్ మోడ్ విధానంలో మీడియం టెర్మ్ సపోర్ట్‌గా 1 నుంచి 4 ఏళ్ల పాటు ఖర్చు చేయడానికి ఉద్దేశించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.


అత్యవసర స్పందన చర్యలను వేగవంతం చేస్తూ, కోవిడ్-19 తీవ్రతను ఇండియాలో తగ్గుముఖం పట్టేలా చూడటమే ప్యాకేజ్ కీలక ఉద్దేశంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సా సౌకర్యాలు మెరుగుపరచడం, వైరస్ సోకిని వారికి అత్యవసరమైన ఔషధాలను అందుబాటులోకి తేవడం, జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రాల స్థాయిలోనూ ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేయడం, భవిష్యత్‌లో వ్యాధులు చెలరేగకుండా తగిన సన్నద్ధతల కోసం ఈ ప్యాకేజీని కేంద్రం ఉద్దేశించింది. లేబొరేటరీలు, నిఘా కార్యకలాపాలను మెరుగుపరచడంతో పాటు బయో-సెక్యూరిటీ సన్నద్ధతలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం పర్యవేక్షణలో ఈ చర్యలు కొనసాగుతాయి.


కరోనా వైరస్ పేషెంట్ల చికిత్స, దేశంలో వైద్య సదుపాయాల పటిష్టతను రూ.15,000 కోట్లతో చేపట్టనున్నట్టు మార్చి 24న దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తద్వారా కరోనా పరీక్షా సదుపాయాల సంఖ్య పెంచడం, పీపీఏ, ఐసొలేషన్ బెడ్లు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు, ఇతర అత్యవసర సామగ్రి శ్రీఘ్ర గతిన అందుబాటులోకి వస్తాయన్నారు. మెడికల్, పారికల్ సిబ్బందిని కూడా పెంచుతామని చెప్పారు.

Updated Date - 2020-04-10T00:46:58+05:30 IST