భారత్-చైనా చర్చలు నిర్మాణాత్మకం, త్వరలో మరోసారి భేటీ

ABN , First Publish Date - 2020-11-08T16:31:54+05:30 IST

భారత్-చైనా కార్ప్స్ కమాండర్ లెవెల్ ఎనిమిదో రౌండ్

భారత్-చైనా చర్చలు నిర్మాణాత్మకం, త్వరలో మరోసారి భేటీ

న్యూఢిల్లీ : భారత్-చైనా కార్ప్స్ కమాండర్ లెవెల్ ఎనిమిదో రౌండ్ చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయి. నవంబరు 6న జరిగిన ఈ సమావేశంలో చెప్పుకోదగ్గ ఫలితాలేవీ కనిపించలేదు. మే నెల నుంచి తూర్పు లడఖ్‌లో ఏర్పడిన సంక్షోభానికి తెరదించేందుకు త్వరలో మరోసారి భేటీ జరుగుతుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. 


భారత్-చైనా మధ్య అరమరికలు లేకుండా, లోతుగా చర్చలు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లోని వెస్టర్న్ సెక్టర్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి దళాల ఉపసంహరణపై అభిప్రాయాలను నిర్మాణాత్మకంగా ఇచ్చిపుచ్చుకున్నట్లు తెలిపింది. ఇరు దేశాల నేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇరు దేశాల ఫ్రంట్‌లైన్ ట్రూప్స్ సంయమనం పాటించాలని, అపార్థాలను, తప్పుడు అంచనాలను నివారించాలని  నిర్ణయించినట్లు పేర్కొంది. చర్చలను కొనసాగిస్తూ తదుపరి చర్చలను త్వరలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది. 


మే నెల నుంచి చైనా తూర్పు లడఖ్‌లో తిష్ఠ వేసింది. ఉత్తర సిక్కింలో కూడా భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ, ఉద్రిక్త వాతావరణం ఏర్పడ్డాయి. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 


Updated Date - 2020-11-08T16:31:54+05:30 IST