స్మరణాత్‌ అరుణాచలే..

ABN , First Publish Date - 2020-02-22T10:05:16+05:30 IST

‘స్వామీ ఇన్ని జన్మలెత్తలేకపోతున్నాం. అందునా వచ్చేది కలియుగం. చాలా తేలికగా అజ్ఞానానికి వశులమైపోతాం. మాయకు లోబడిపోతాం. తప్పు పనులు చేస్తాం. మళ్లీ పునర్జన్మలొస్తాయి. మరి అలా రాకుండా ఉండాలంటే

స్మరణాత్‌ అరుణాచలే..

దర్శనాత్‌ ప్రసీదసీ జననాత్‌ కమలాలయే

కాశ్యాంతు మరణాన్ముక్తిః స్మరణాత్‌ అరుణాచలే

‘స్వామీ ఇన్ని జన్మలెత్తలేకపోతున్నాం. అందునా వచ్చేది కలియుగం. చాలా తేలికగా అజ్ఞానానికి వశులమైపోతాం. మాయకు లోబడిపోతాం. తప్పు పనులు చేస్తాం. మళ్లీ పునర్జన్మలొస్తాయి. మరి అలా రాకుండా ఉండాలంటే మాకొక తేలికమార్గం ఏదైనా ఉపదేశం చెయ్యి’ అంటూ ఒకానొకప్పుడు మానవులు వేడుకోగా.. సాక్షాత్తూ పరమేశ్వరుడు చేసిన ఉపదేశం ఇది. దీని ప్రకారం.. చిదంబరంలో ఆకాశలింగాన్ని దర్శనం చేసుకుంటే ఇక పుట్టవలసిన అవసరం లేదు. చిదంబరంలో దర్శనమంటే.. అక్కడ మారేడు దళాల దండలుంటాయంతే. ఆకాశమంటే అంతటా నిండిపోయి ఉంటుంది. అంతటా నిండిన ఆకాశంలో అన్నీ ఉంటాయి. అటువంటి ఆకాశాన్ని, అనంతంగా నిండిపోయిన ఆకాశ స్వరూపాన్ని ఒక గోడగా చూపించి దానికే మారేడు దళాలు వేస్తారు. అంతటా నిండినిబిడీకృతమైపోయి ఉన్నది పరమేశ్వర స్వరూపమని అర్థం చేసుకోగలిగేవాడికి చిదంబర దర్శన రహస్యం తెలుస్తుంది. లేనివాడికి చిదంబర దర్శనం అర్థం కాదు. అందుకే భక్తులు.. ‘మహాప్రభో మాకది ఎలా నిలబడుతుంది? అంత తేలికా? సాధ్యం కాదు. ఇంకొంచెం తేలిక మార్గం చెప్పండి’ అన్నారు. అప్పుడు.. ‘కమలాలయంలో పుట్టండి మీకు మోక్షమిస్తాన’న్నాడు పరమశివుడు. కమలాలయమంటే తిరువారూర్‌. అక్కడ పుడితే చాలు మోక్షం. కానీ పుట్టడం మన చేతిలో ఉందా? అదే మాట అడిగితే శివుడు మరొక మాట చెప్పాడు. ‘కాశ్యాంతు మరణాన్ముక్తిః’.. ‘పోనీ.. పుట్టడం నీ చేతిలో లేదు. నీ కర్తవ్యాలన్నీ అయిపోయాయనుకున్నప్పుడు కాశీకి వెళ్లిపోయి, కాశీ పట్టణంలో ఉండిపోయి అక్కడ శరీరం విడిచిపెట్టేస్తావా? మోక్షమిచ్చేస్తాను.’ అన్నాడు. ‘అయ్యా కాశీకి పోవాలంటే అంత తేలికా, పిల్లల్ని మనవల్ని వదిలేసి? పైగా నేను వెళదామనుకునేలోపల శరీరం వదిలిపెడితే ఎలా సాధ్యమవుతుంది? ఇంకొక మాట ఏమైనా చెప్పండి’ అంటే.. ‘స్మరణాత్‌ అరుణాచలే’ అన్నాడు. ‘ప్రతి రోజూ ఒక్కసారి అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అని మనసులో అరుణాచల క్షేత్రాన్ని నువ్వు స్మరణ చేయగలవా? ఒక్కసారి గుర్తుతెచ్చుకోగలవా?’ అన్నాడు. అరుణాచల క్షేత్రాన్ని స్మరిస్తే చాలు మోక్షమిచ్చేస్తానన్నాడు. స్కాందపురాణంలో ఒక విషయాన్ని చెబుతారు. ఒక జీవుడు ఆజన్మపరంపరల్లో ఎప్పుడైనా అరుణాచల క్షేత్ర ప్రవేశం చేస్తే.. ఆ జీవుని యాత్రలో ‘వీడు అరుణాచల ప్రవేశం చేశాడు’ అని ఒక ఎర్ర గీత పెడతారు. అరుణాచల ప్రవేశం చేసిన జీవుని యాత్ర ఒక విశేషమైన మలుపు తిరిగిందని గుర్తు. కానీ.. అరుణాచలానికి వెళ్లడం, అరుణాచలేశ్వరుడి దర్శనం అంత తేలికైన విషయాలు కావు. ఒక్క కారణం చేత మాత్రమే ఆ క్షేత్రంలోకి ప్రవేశించగలరని పెద్దలు చెబుతారు. ఏమిటా కారణమంటే.. ‘నాకేమీ తెలియదు, నాకేమీ చేతకాదు’ అన్న భావనతో, వినయంతో వెళ్లేవారికే అరుణాచల ప్రవేశం సాధ్యం. ‘పరమేశ్వరా నాకేమీ తెలియదు. నాకున్నవన్నీ పాపాలే. నిన్ను నమ్ముకుని వస్తున్నాను. నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు’ అని అడిగినవాడికి ఆ క్షేత్రంలోకి ప్రవేశం లభిస్తుంది. జ్ఞానసంబంధ నాయనార్‌ అంతటి మహానుభావుడే అంత తేలిగ్గా ఆ క్షేత్రంలోకి వెళ్లలేకపోయాడు. దొంగలు ఉన్నవన్నీ ఎత్తుకుపోతే అప్పుడాయన బాధపడి, ఈశ్వరుడిని కీర్తించి పరమ నిరాడంబరంగా వినయంతో వెళ్తే అరుణాచల పట్టణంలోకి ప్రవేశించగలిగాడు. 

- చాగంటి కోటేశ్వరరావు శర్మ

















 











Updated Date - 2020-02-22T10:05:16+05:30 IST