ఇంటినుంచి బయటికెళ్లాలంటే జంకుతున్న మహిళలు

ABN , First Publish Date - 2021-05-18T12:28:25+05:30 IST

మహిళలు ఇంటినుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.

ఇంటినుంచి బయటికెళ్లాలంటే జంకుతున్న మహిళలు

హైదరాబాద్/జవహర్‌నగర్‌ : జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో వరుసగా చైన్‌స్నాచింగ్‌లు జరుగుతుండటంతో మహిళలు ఇంటినుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కార్పొరేషన్‌ పరిధిలోని చంద్రపురి కాలనీలో వాటర్‌ట్యాంకు ఎదురువీధిలో ఓ వృద్ధురాలు కిరాణ దుకాణం నిర్వహిస్తోంది. సోమవారం గుర్తుతెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చి మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసును దొంగిలించాడు. దీంతో ఆమె రోదిస్తూ స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఏసీపీ శివకుమార్‌ స్థానిక పోలీసులతో అక్కడకు చేరుకుని బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏసీపీ మాట్లాడుతూ చైన్‌స్నాచర్‌లను రెండు, మూడు రోజుల్లోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అయితే.. ఇదే కాలనీలో 24 గంటల్లో ఇది రెండవ చైన్‌స్నాచింగ్‌. ఈ నెలలోనే మూడోది. దీంతో మహిళలు ఒంటరిగా బయటకు రావాలంటే భయపడుతున్నారు.

Updated Date - 2021-05-18T12:28:25+05:30 IST