చాణక్య నీతి: పనిచేసే చోట గౌరవం లభించడం లేదా?.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోండి.. అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు!
ABN , First Publish Date - 2021-11-29T12:21:29+05:30 IST
ఆచార్య చాణక్యుడిని కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు..
ఆచార్య చాణక్యుడిని కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు అని కూడా పిలుస్తారు. చాణక్య గొప్ప తెలివితేటలు కలిగిన పండితుడు మాత్రమే కాకుండా, ఎంతో అర్హత సాధించిన అధ్యాపకుడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తక్షశిల విశ్వవిద్యాలయం నుంచి విద్యను అభ్యసించి, అక్కడి విద్యార్థులకు ఆచార్యునిగా మార్గనిర్దేశం చేశారు. చాణక్య ఎంతో నైపుణ్యం కలిగిన వ్యూహకర్త, దౌత్యవేత్త. ఆచార్య చాణక్యుడు రచించిన అనేక గ్రంథాలు ఈనాటికీ ప్రజలకు మార్గనిర్దేశం చేస్తున్నాయి. వీటిలో నీతిశాస్త్రం అనే గ్రంథంలో ఆచార్య చాణక్యుడు తన జ్ఞానం, అనుభవం ఆధారంగా మానవ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఆలోచనలను పంచుకున్నారు. ఇవి మనిషి జీవితాన్ని చాలా దగ్గరగా స్పృశిస్తాయి. ఆచార్య చాణక్యుడు.. మనిషి వ్యక్తిగత జీవితం మొదలుకొని మనిషి ప్రవర్తన వరకు ముఖ్యమైన సూచనలు చేశారు. వాటిలో.. ఒక ఉద్యోగి కార్యాలయంలో లేదా పనిచేసే ప్రాంతంలో ఎలా మెలగాలో, ఎలా మెగిలిగితే గౌరవం పొందుతాడో తెలిపారు.
క్రమశిక్షణ
జీవితంలో ఎప్పుడూ కఠినమైన క్రమశిక్షణ పాటించాలని చాణక్య నీతి చెబుతోంది. పని ప్రదేశంలో ఇది మరింత అవసరమని తెలియజేస్తోంది. సమయపాలన పాటించని వ్యక్తులు, ప్రతిపనిలో నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తారు. వారు పనిలో తమ సహోద్యోగుల కంటే వెనుకబడి ఉంటారు. దీనితో పాటు, అటువంటి వ్యక్తులు ఎల్లప్పుడూ అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ఉద్యోగి తన ఉద్యోగ జీవితంలో ముందుకు సాగుతూ, కార్యాలయంలో గౌరవం పొందాలనుకుంటే క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యమని ఆచార్య చాణక్య తెలిపారు.
వాదించడం మానుకోండి
కార్యాలయంలో అనవసర వాదనలు మానుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు. ఇలా వాదనకు దిగేవారికి వారికి దూరంగా ఉండాలని చాణక్య తెలిపారు. ఈ విధంగా మీరు విమర్శలకు దిగితే.. మీ విలువైన సమయాన్ని వృథా చేస్తారని, అప్పుడు ఎవరూ మిమ్మల్ని గౌరవించరని చాణక్య తెలిపారు. ముఖ్యంగా కార్యాలయంలో గౌరవం కాపాడుకోవాలనుకుంటే మీరు సహోద్యోగులతో వాదనలకు, దూషణలకు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్య తెలిపారు.
మర్యాద ఇచ్చిపుచ్చుకోండి
కార్యాలయం లేదా పనిచేసే ప్రాంతంలో మర్యాద నియమాలను ఎల్లప్పుడూ పాటించాలి. జీవితంలో విజయం సాధించాలన్నా, గౌరవం పొందాలన్నా ప్రవర్తనలో ఎల్లప్పుడూ వినయాన్ని కలిగివుండాలని ఆచార్య చాణక్య తెలిపారు.