థర్డ్వేవ్ వచ్చినా యుద్ధప్రాతిపదికన ఎదుర్కొంటాం: కేజ్రీవాల్
ABN , First Publish Date - 2021-06-12T21:59:41+05:30 IST
దేశంలో కోవిడ్ థర్డ్వేవ్ అవకాశాలు వాస్తవరూపం దాల్చే వీలుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్..
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ థర్డ్వేవ్ అవకాశాలు వాస్తవరూపం దాల్చే వీలుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. థర్డ్ వేవ్ వచ్చినా యుద్ధ ప్రాతిపదికన దానిని ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ''థర్డ్ వేవ్ రాకూడదనే మేము ప్రార్థిస్తున్నాం. ఒకవేళ మరో వేవ్ అంటూ వస్తే కలిసికట్టుగా పోరాడేందుకు ఢిల్లీ సిద్ధంగా ఉంది'' అని సీఎం అన్నారు. థర్డ్ వేవ్ భయాలు యూకేలో కనిపిస్తున్నాయని, అక్కడ కేసులు కూడా పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో మనం అచేతనంగా ఉండరాదని పేర్కొన్నారు.
ఢిల్లీ వ్యాప్తంగా తొమ్మిది ఆసుపత్రుల్లో కొత్తగా 22 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల ప్రారంభోత్సవం సందర్భంగా వర్చువల్ ఈవెంట్లో కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఢిల్లీలోని తొమ్మిది ఆసుపత్రుల్లో కొత్త ఆక్సిజన్ ప్లాంట్లు వచ్చి చేరడంతో కోవిడ్పై తాము జరుపుతున్న పోరాటం మరింత పటిష్టమైందని చెప్పారు. సెకెండ్ వేవ్ను ఢిల్లీవాసులు కలిసికట్టుగా ఎదుర్కొన్నారని, క్రమశిక్షణతో విజయవంతంగా కోవిడ్ను అదుపు చేశారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఈ పోరాటంలో పారిశ్రామిక రంగం కూడా వచ్చిచేరినందుకు కృతజ్ఞతలు తెలిపారు.