ఇదేనా మీ నాడు.. నేడు?: చంద్రబాబు
ABN , First Publish Date - 2020-08-13T07:27:45+05:30 IST
ఇదేనా మీ నాడు.. నేడు?: చంద్రబాబు
బతికించమంటూ హెచ్ఎం వేడుకోలు బాధాకరం
హెడ్మాస్టర్ మరణంపై చంద్రబాబు ఆవేదన
అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా మనుబోలు జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ రమేష్ కుమార్ తనకు కరోనా వచ్చిందని.. ఆస్పత్రిలో చేర్చుకోవాలని ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదని, చివరకు ఆయన కన్నుమూశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘‘గురుదేవో భవ అని భావించే సమాజం మనది. కానీ ఈ హెడ్మాస్టర్ తనను ఆసుపత్రిలో చేర్చుకొని ప్రాణాలు కాపాడాలని ఆస్పత్రి సిబ్బందిని... అధికారులను.. వైసీపీ నేతలను వేడుకొన్నా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఆయన కన్నుమూశారు. నాడు ఒక హెడ్మాస్టర్ ఉండేవారు. నేడు లేరు. ఇదేనా మీ నాడు... నేడు? ఈ రాష్ట్రంలో అసలు పాలనా యంత్రాంగం ఉందా? చూసేవారికి ఎంతో బాధ కలుగుతున్నా ప్రభుత్వంలో మాత్రం స్పందన లేదు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆసుపత్రిలో చేర్చుకోవాలని వేడుకొంటూ రమేష్ కుమార్ విడుదల చేసిన ఒక వీడియోను కూడా ఆయన తన ట్వీట్కు జత చేశారు.
యువశక్తిని పట్టించుకోండి
యువతను పట్టించుకొని వారిని తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా బుధవారం ఆయన యువతకు తన ట్విట్టర్ ఖాతాలో శుభాకాంక్షలు తెలిపారు.