వైద్యం చేయించే దిక్కేదీ?

ABN , First Publish Date - 2021-05-15T09:45:16+05:30 IST

కరోనా విలయాన్ని తట్టుకోవడానికి వైద్యం చేయిచే దిక్కే లేకుండా పోయిందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పడకలు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు దొరక్క..

వైద్యం చేయించే దిక్కేదీ?

ఇటు కరోనా పీడ.. అటు జగన్‌ రెడ్డి వివక్ష

మైనారిటీలు తీవ్ర కష్టాల్లో ఉన్నారు

టీడీపీ పథకాలన్నీ నిర్వీర్యం.. నోరుతెరిస్తే కేసులతో వేధింపులు

కాలికింద చెప్పులా తొక్కేస్తున్నారు

దుల్హన్‌కు ఇస్తానన్న లక్ష ఇవ్వనేలేదు.. పైగా ఆ పథకాన్నే ఎత్తేశారు

హజ్‌ యాత్రకు సాయం బంద్‌.. రంజాన్‌ తోఫా నిలిపివేశారు

యువతకు బ్యాంకు లింకేజీ మాయం

ప్రభుత్వ తీరుపై చంద్రబాబు ఆక్షేపణ

రంజాన్‌ సందర్బంగా ముస్లిం నేతలతో ఆన్‌లైన్‌ భేటీ


అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): కరోనా విలయాన్ని తట్టుకోవడానికి వైద్యం చేయిచే దిక్కే లేకుండా పోయిందని మాజీ ముఖ్యమంత్రి,  టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పడకలు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు దొరక్క వందల మంది మరణిస్తున్నారని, పలుకుబడి లేని సామాన్యులు అమానవీయ పరిస్ధితుల్లో మరణిస్తున్నా వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని దుయ్యబట్టారు. ఒక పక్క కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంటే.. మరో పక్క జగన్‌ రెడ్డి ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష ముస్లిం మైనారిటీలను తీవ్రంగా వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రంజాన్‌ సందర్భంగా టీడీపీకి చెందిన ముస్లిం నేతలతో శుక్రవారం ఆయన ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు. వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తగిన జాగ్రత్తలతో భౌతిక దూరం పాటిస్తూ పండుగ జరుపుకొన్నందుకు అభినందించారు. ‘కోరి తెచ్చుకున్న ప్రభుత్వం తమను మోసం చేసిందని మైనారిటీలు కలత చెందుతున్నారు. 


టీడీపీ ప్రభుత్వం పెట్టిన పఽథకాలన్నీ పూర్తిగా నిర్వీర్యం చేశారు. నోరు తెరిచి ప్రశ్నిస్తే కేసులతో వేధిస్తున్నారు. కాలి కింద చెప్పులా తొక్కి ఉంచుతున్నారు. సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగలను బాధలతో చేసుకోవాల్సి వస్తోంది. ప్రచారం కొండంత ఉన్నా అమలు గోరంత కూడా లేదు. దుల్హన్‌ పథకం కింద పేద ముస్లిం కుటుంబాల వారికి రూ.50 వేల వంతున కేవలం ఒక్క ఏడాదిలోనే ఎనభై వేల మందికి సాయం చేశాం. తానొస్తే ఆ మొత్తాన్ని రూ.లక్ష చేస్తానని గప్పాలు కొట్టిన జగన్‌ రెడ్డి ఆ పఽథకాన్ని పూర్తిగా ఎత్తేశాడు. ఈ రెండేళ్లలో ఎవరికీ పైసా సాయం చేయలేదు. హజ్‌ యాత్రకు ప్రభుత్వపరంగా చేసే సాయాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఇమాంలు, మౌజంలకు నెలసరి వేతనాన్ని రూ. 15 వేలు చేస్తానని చెప్పి మోసం చేశారు. పండుగ ఆనందంగా జరుపుకోవాలని మేం ఇచ్చిన రంజాన్‌ తోఫాను నిలిపివేశారు. మసీదుల సుందరీకరణకు ఇచ్చే నిధులు ఎత్తివేశారు. ముస్లిం నిరుద్యోగ యువతకు టీడీపీ ప్రభుత్వం రూ.3 లక్షలు బ్యాంకు లింకేజి ఇచ్చి అందులో రూ.లక్ష సబ్సిడీగా ఇచ్చింది. దీనిని పొందడానికి వయో పరిమితిని 55 ఏళ్లకు పెంచింది. ఏటా పది వేల మంది యువత దీని కింద స్వయం ఉపాధి యూనిట్లు పెట్టుకునేవారు. దానినీ ఎత్తివేశారు. ఇల్లు, దుకాణం కలిపి పెట్టుకునే దుకాణ్‌-మకాన్‌ పథకాన్ని మనం అమలు చేస్తే ఈ ప్రభుత్వం రాగానే ఎత్తివేసింది. విదేశాల్లో చదువుకోవాలనుకునే ముస్లిం విద్యార్థులకు రూ.10 నుంచి రూ.15 లక్షల వరకూ సాయం చేశాం.


 అదీ ఎత్తివేశారు. మసీదులు, శాదీఖానాల నిర్మాణం నిలిపివేశారు. అత్యున్నతమైన మండలి ఛైర్మన్‌ పదవిని ముస్లిం వర్గాల ప్రతినిధికి ఇస్తే వైసీపీ నేతలు ఆయన్ను చెప్పలేని భాషలో దూషించారు’ అని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పోలీసుల వేధింపులు భరించలేక అబ్దుల్‌ సలాం అనే సామాన్యుడు తన కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటే ఒక్కరిపై కూడా చర్య లేదని, అనేక చోట్ల ముస్లిం మైనారిటీల పరిస్ధితి ఇదే మాదిరిగా ఉందని అన్నారు. టీడీపీ హయాంలో ముస్లిం మైనారిటీలు గుండెలపై చేయి వేసుకుని భద్రంగా నిద్ర పోగలిగే పరిస్థితి ఉండేదని చెప్పారు. వారి ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి మంచి ప్రణాళికతో ముందుకు వస్తామని తెలిపారు.




ఆ నిధులు ఇంకా ఇవ్వలేదు.. 

విజయవాడలో హజ్‌ హౌస్‌ నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం మంజూరుచేసిన నిధులను ఇప్పటివరకూ జగన్‌రెడ్డి ప్రభుత్వం విడుదల చేయలేదని మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ మండిపడ్డారు. టీడీపీ హయాంలో అమలైనన్ని సంక్షేమ కార్యక్రమాలు ముస్లిం మైనారిటీలకు ఏ ప్రభుత్వమూ చేయలేదని  చెప్పారు. నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడుతూ.. కరోనా వల్ల చనిపోతున్న వారిలో కేవలం పదో వంతు మాత్రమే ప్రభుత్వ లెక్కల్లో కనిపిస్తున్నారని, అనేక మంది తమ కుటుంబ సభ్యులను, బంధువులను కోల్పోయారని తెలిపారు. ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేక పేదలు, సామాన్యులు అల్లాడుతున్నారని, వందల మంది చనిపోతున్నా ప్రభుత్వం అదేదో సాధారణ విషయం మాదిరిగా చూస్తోందని విమర్శించారు. విశాఖ టీడీపీ నేత ఎండీ నజీర్‌ మాట్లాడుతూ.. రంజాన్‌ మాసంలో ముస్లిం సోదరులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా మాట్లాడారు. 

Updated Date - 2021-05-15T09:45:16+05:30 IST