వెంకటేశ్వరస్వామి వదలరు.. ఖబడ్దార్‌ జగన్‌: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-04-13T01:04:32+05:30 IST

వెంకటేశ్వరస్వామి వదలరు.. ఖబడ్దార్‌ జగన్‌: చంద్రబాబు

వెంకటేశ్వరస్వామి వదలరు.. ఖబడ్దార్‌ జగన్‌: చంద్రబాబు

తిరుపతి: సీఎం జగన్‌పై మాజీ సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరపున తిరుపతి గాంధీరోడ్డులో ఆయన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి ఆగిందని.. రౌడీయిజం పెరిగిందని మండిపడ్డారు. వెంకన్న ఆశీస్సులతోనే ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. ‘‘తిరుపతిని ఏడు నుంచి 5 కొండలు చేస్తామని వైఎస్‌ అన్నాడు. పింక్‌ డైమండ్‌ మా ఇంట్లో ఉందని ఆరోపణలు చేశారు. ఇప్పుడు అసలు పింక్‌ డైమండే లేదంటున్నారు. రమణదీక్షితులు.. జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చడమేంటి?. రాముడి తల తీసిన వాళ్లను పట్టుకోకుండా నిలదీసిన మాపై కేసులా?. ఖబడ్దార్‌ జగన్‌రెడ్డి.. మరో దేవాలయంపై దాడి జరిగితే అంతుచూస్తాం. ఓట్ల కోసం ఇంటింటికి తిరుమల లడ్డూని పంచారు. లడ్డూలు పంచుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు?. వెంకటేశ్వరస్వామి మాత్రం మిమ్మల్ని వదలరు.’’ అని చంద్రబాబు హెచ్చరించారు. 



చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ ‘‘ రెండేళ్లలో వైసీపీ రాష్ట్రానికి ఏం చేసింది?. ఒక్క అవకాశం అంటూ ఇంటింటికి తిరిగి ముద్దులు పెట్టారు. ఇప్పుడు రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నారు. ప్రత్యేక హోదా తేవడంలో టీడీపీ విఫలమైందన్నారు. నేను పోటుగాడిని హోదా తీసుకొస్తానని జగన్‌ అన్నాడు. పోలీసులను పెట్టుకుని రాజకీయం చేయడం కాదు. నామినేషన్‌ వేసిన వాళ్లని బెదిరిస్తారా?. ఈ రాష్ట్రం మీ తాత జాగీరా.. మీ నాన్న సొత్తా?. నేను తలుచుకుని ఉంటే జగన్‌ అడుగు బయటపెట్టేవాడా?. పులివెందుల సంస్కృతి రాష్ట్రంలో తేవాలనుకుంటున్నారా?. చరిత్రహీనులుగా మిగిలిపోవద్దు. ఇది పులివెందుల కాదు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుర్తుపెట్టుకో.’’ అని అన్నారు. 

Updated Date - 2021-04-13T01:04:32+05:30 IST