Chandrababu కీలక నిర్ణయం.. వలంటీర్లకు పోటీగా త్వరలో..!
ABN , First Publish Date - 2022-01-09T11:49:43+05:30 IST
Chandrababu కీలక నిర్ణయం.. వలంటీర్లకు పోటీగా త్వరలో..!
చిత్తూరు జిల్లా/కుప్పం : మూడు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా చివరి రోజైన శనివారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో పర్యటించారు. పర్యటన చివరి రోజున స్థానికంగా ఉన్న రహదారులు-భవనాల శాఖ అతిథి గృహంలో నియోజకవర్గంలోని సీనియర్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతోపాటు అనేక రాజకీయపరమైన, పార్టీపరమైన పనులు కూడా వలంటీర్లకు అప్పగించి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నదని చంద్రబాబు ఆరోపించారు. వలంటీర్లకు ప్రత్యామ్నాయంగా పార్టీ తరఫున సేవామిత్రలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన కీలక ప్రకటనే చేశారు. ప్రతి వందమంది ఓటర్లకు ఒక యువ ప్రతినిధిని పార్టీ తరఫున ఏర్పాటుచేసి, అధికారంలోకి వచ్చాక వాళ్లనే వలంటీర్లుగా మారుద్దామని చంద్రబాబు సమావేశంలో వెల్లడించారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పీఎస్.మునిరత్నం, చంద్రబాబు పీఏ మనోహర్తోపాటు పలువురు సీనియర్ పార్టీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.