ములుగు రామలింగేశ్వర సిద్దాంతి మృతికి చంద్రబాబు సంతాపం
ABN , First Publish Date - 2022-01-24T16:50:21+05:30 IST
ములుగు రామలింగేశ్వర సిద్దాంతి మృతికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
హైదరాబాద్: ములుగు రామలింగేశ్వర సిద్దాంతి మృతికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామలింగేశ్వర సిద్దాంతి మృతి బాధాకరమని అన్నారు. ప్రముఖ పంచాగ కర్తగా ఆయన అందరికీ సుపరిచితమన్నారు. ములుగు వారి వార ఫలాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రామలింగేశ్వర సిద్దాంతి అత్యంత సుప్రసిద్ధులని, ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని చంద్రబాబు అన్నారు.
శ్రీకాళహస్తి దేవస్థాన ఆస్థాన జ్యోతిష పండితుడు, శ్రీశైల, వీరశైవ పీఠాధిపతి ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి (63) శివైక్యమయ్యారు. ఆదివారం సాయంత్రం తీవ్రమైన గుండెపోటు రావడంతో.. ఆయన తుదిశ్వాస విడిచారు. సాయంత్రం హైదరాబాద్లోని బంజారాహిల్స్కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో.. నిమ్స్ ఆస్పత్రి వద్ద కారులోనే ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే డ్రైవర్.. అదే ఆస్పత్రిలోకి తీసుకెళ్లగా.. అక్కడ ఎమర్జెన్సీ బెడ్లు ఖాళీ లేకపోవడంతో.. సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆయన మృతి చెందారని నిర్ధారించారు. గుంటూరు జిల్లా పండరీపురం గ్రామంలో జన్మించిన ములుగు.. పంచాంగ శ్రవణం, రాశిఫలాలు, జ్యోతిష ఫలితాలను వెల్లడించడం ద్వారా ఖ్యాతి గడించారు. నాలుగు దశాబ్దాలకు పైగా జ్యోతిష రంగానికి సేవలందించారు.