దళితుల సంక్షేమం గాలి కొదిలేయడం బాధాకరం: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-04-05T21:14:34+05:30 IST

భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు.

దళితుల సంక్షేమం గాలి కొదిలేయడం బాధాకరం: చంద్రబాబు

అమరావతి: భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. దళితుల ఆశాజ్యోతి జగ్జీవన్ రామ్‌ సమతావాదం ఆదర్శంగా దళితాభ్యుదయానికి పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు. ‘సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లని’ చాటుదామని పిలుపునిచ్చారు. దేశానికే దిశానిర్దేశం చేసే లోక్ సభ స్పీకర్‌గా ఒక దళితనేతను చేసిన పార్టీ తమదని, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్‌గా ఒక దళిత మహిళా నేతను గౌరవించిన పార్టీ కూడా తమదేనని చంద్రబాబు అన్నారు. బడుగు, బలహీన వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేశామని.. అంబేద్కర్, జగజ్జీవన్ రామ్, జ్యోతిరావ్ పూలే వంటి మహాశయుల లక్ష్యాల సాధన కోసం అంకితమైన పార్టీ తెలుగుదేశమన్నారు. గత ఐదేళ్ళ పాలనా కాలంలోనూ ఎస్సీల అభ్యున్నతికి ఎంతో కృషి చేశామన్నారు. పేద ఎస్సీ ఆడబిడ్డ పెళ్ళికి రూ.40 వేలు పెళ్ళికానుకగా ఇచ్చామని.. ఎస్సీ విద్యార్థుల విదేశీ చదువులకు రూ.10 లక్షల ఆర్ధిక సాయం అందించామన్నారు. ‘జ్ఞానభూమి’ ద్వారా లక్షలాది విద్యార్ధులకు ఫీజు రీఇంబర్స్ మెంటు, ఉపకారవేతనాలు ఇచ్చామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.   


‘జగ్జీవన్ జ్యోతి’ పథకం కింద ఎస్సీల ఇళ్ళకు 100 యూనిట్ల ఉచిత కరెంటు.. డప్పు కళాకారులకు ప్రతి నెలా రూ.1,500 పింఛను ఇచ్చామన్నారు. ఎస్సీల సంక్షేమానికి 4 ఏళ్లలోనే రూ.40,253 కోట్ల బడ్జెట్ పెట్టామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 6.56 లక్షల మందికి జీవనోపాధులు కల్పించామన్నారు. ఎస్సీ యువత స్వయం ఉపాధి కోసం ఇన్నోవాలు, జేసీబీలు, ఇతర వాహనాలు అందించామన్నారు. ‘దళితతేజం’ నలుదెసలా విస్తరించామన్నారు. అయితే గత 11నెలలుగా దళితుల సంక్షేమం గాలి కొదిలేయడం బాధాకరమన్నారు. ఎస్సీల నిధులను దారి మళ్లించి రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాశారన్నారు. ఇళ్లస్థలాల ముసుగులో, పేదల అసైన్డ్ భూములను లాక్కుని వేలాది దళిత కుటుంబాల పొట్టకొట్టడం ఆవేదనకు గురిచేస్తోందని చంద్రబాబు ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-04-05T21:14:34+05:30 IST