జగన్‌ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటాం: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-03-03T01:36:32+05:30 IST

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై తెలుగుదేశం నేతలతో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

జగన్‌ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటాం: చంద్రబాబు

అమరావతి: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆపార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ గెలిచిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో.. ఆస్తి పన్ను తగ్గిస్తూ కౌన్సిల్ తొలి సమావేశంలోనే తీర్మానిస్తామని చెప్పారు. రిజిస్టర్ విలువ ఆధారంగా పట్టణాల్లో భారీగా ఆస్తి పన్ను పెంచేందుకు.. జగన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని చంద్రబాబు అన్నారు. ఆస్తి పన్ను పెరగడం వల్ల ఇంటి అద్దెలు పెరిగి మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారన్నారు. ఇసుక, సిమెంట్, గ్యాస్, డీజల్, పెట్రోల్, వంట నూనెల ధరలు పెరుగుదలతో సామాన్యులపై భారం పడుతోందన్నారు.


కష్టకాలంలో పోరాడితేనే నాయకులకు ప్రజల్లో గుర్తింపు వస్తుందన్నారు.  జగన్‌కు ఓటేస్తే ప్రజలపై భారం పడుతుందని చెప్పారు. వైసీపీ బెదిరింపులకు భయపడి. నామినేషన్లు వెనక్కు తీసుకోవడం పిరికిచర్య అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వ దుర్మార్గ పాలనను వివరించాలని చంద్రబాబు పేర్కొన్నారు. మద్యం సీసాలు వాళ్లే తెచ్చిపెట్టి టీడీపీ వారిపైనే కేసులు పెట్టడానికి కూడా వెనుకాడరని చెప్పారు. ఇలాంటి వాటి పట్ల నాయకులు జాగ్రత్త పడాలని సూచించారు. గురువారం నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు.నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా పోరాడాలి.. ఏదైనా ఘటన జరిగితే నేను కూడా వచ్చి పోరాడతానని హామీ ఇచ్చారు. టీడీపీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-03T01:36:32+05:30 IST