నా రాజకీయ చరిత్రలో ఇలాంటి పాలన చూడలేదు: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-01-04T20:36:20+05:30 IST

నా రాజకీయ చరిత్రలో ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.

నా రాజకీయ చరిత్రలో ఇలాంటి పాలన చూడలేదు: చంద్రబాబు

గుంటూరు: నా రాజకీయ చరిత్రలో ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైసీపీ పాలనతో ప్రజలంతా నష్టపోతున్నారు. ఏపీ భవిష్యత్‌ కోసం ప్రతిఒక్కరూ ఆలోచించాలి. రాష్ట్రంలో జరగబోయే నష్టాన్ని ప్రజలంతా గమనించాలి. రాష్ట్రంలో విధ్వంసంతో పరిపాలన ప్రారంభించారు.ప్రజల కోసం కట్టిన ప్రజావేదికను కూల్చారు. రాజధాని కోసం 50 వేల ఎకరాల భూమిని రైతులు ఇచ్చారు.రాజధానిలో రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టాం.గత ప్రభుత్వాలు ఇలాగే విధ్వంసం చేస్తే హైదరాబాద్‌ ఉండేదా?. ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని చెప్పి మాట తప్పారు. కోట్ల ఆస్తిని విధ్వంసం చేస్తున్నప్పుడు ప్రజా చైతన్యం అవసరం.అమరావతి, పోలవరం అభివృద్ధి చెందితేనే ఏపీకి భవిష్యత్తు. పోలవరం డీపీఆర్‌ను ఎందుకు ఖరారు చేయలేకపోయారు?. పోలవరం పూర్తి  చేయడం మీకు చేతనవుతుందా?. పోలవరంపై శ్వేతపత్రం ఇచ్చే ధైర్యం సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఉందా?. ఏపీకి ప్రాజెక్టులు తేవడం విధ్వంసం చేసినంత సులువు కాదు. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ చేశాం. ఆ పెట్టుబడులు వస్తే 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 


‘‘దేశానికి అన్నంపెట్టిన ఏపీలోనే వరి వేయొద్దని చెబుతున్నారు.వైసీపీ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉంది. ఇంగ్లీష్‌ మీడియం అన్నారు, నాడు- నేడు అన్నారు.. టీచర్లు కావాలని పిల్లలు ఆందోళన చేసే పరిస్థితులు కల్పించారు. జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ ఇచ్చారు. ప్రజలు, మీడియా వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారు.ప్రజా సమస్యలపై ఎవరు పోరాడినా దాడులకు దిగుతున్నారు’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.


‘‘నవరత్నాలు కాదు.. టీడీపీ ఎన్నో రత్నాలు ఇచ్చింది. పన్నుల పేరుతో ప్రజలపై తీవ్రమైన భారం మోపారు.చెత్తమీద కూడా పన్ను వేసిన ఏకైక ప్రభుత్వం జగన్‌రెడ్డిది. అన్న క్యాంటీన్లను ఎందుకు మూసివేశారు?. రెండేళ్లలో కరెంట్‌ ఛార్జీలను ఆరుసార్లు పెంచారు. రాష్ట్రంలో మద్యంపై పెద్దఎత్తున దోపిడీ చేస్తున్నారు.మద్యపాన నిషేధ హామీ ఏమైంది?. ఒక్కరోజే రూ.124 కోట్ల మద్యం అమ్మకాలా?.ఇసుక, ఓటీఎస్‌ పేరుతో దోపిడీ చేస్తున్నారు.డ్రగ్‌ ఆంధ్రప్రదేశ్‌ అని ఇతర రాష్ట్రాలు అవమానించే పరిస్థితికి తెచ్చారు. కరోనాకు వ్యాక్సిన్ ఉంది.. జగన్ పాలనకు ఎలాంటి వ్యాక్సిన్ లేదు. జగన్‌కు తాను తప్ప ఎవరూ అక్కర్లేదు.. చెల్లి లేదు.. తల్లి లేదు’’ అని తీవ్రస్థాయిలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-01-04T20:36:20+05:30 IST