‘సిట్’పై ఫస్ట్ టైమ్ స్పందించిన చంద్రబాబు
ABN , First Publish Date - 2020-02-23T01:18:18+05:30 IST
చంద్రబాబు ప్రభుత్వ పాలనపై వైసీపీ సర్కార్ సిట్ను (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే...
అమరావతి : చంద్రబాబు ప్రభుత్వ పాలనపై వైసీపీ సర్కార్ సిట్ను (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సిట్కు ఇంటలిజెన్స్ డీఐజీ నేతృత్వం వహించనున్నారు. సిట్లో సభ్యులుగా పోలీసు అధికారులే ఉన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనపై త్వరగతిన దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని కీలక నిర్ణయాలపై సిట్ విచారణ జరపనుంది. కాగా.. ఈ సిట్పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు శనివారం నాడు వరుస ట్వీట్స్ చేశారు.
టీడీపీని కాదు ఏకంగా..!
‘ఈ ప్రభుత్వానికి నా మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎంత కక్ష ఉందో చెప్పడానికి మా ఐదేళ్ళ పాలన మీద నిన్న వేసిన సిట్ మరో ఉదాహరణ. ఇదేమీ కొత్తకాదు. 9 నెలల్లో 3 సిట్లు, అయిదారు కమిటీలు వేసి తెలుగుదేశం పార్టీని కాదు. ఏకంగా ఏపీనే టార్గెట్ చేసారు. భావితరాలకు తీరని నష్టం చేసారు. అధికారంలోకి వస్తూనే తవ్వండి, తవ్వండి అన్నారు. తవ్వితే సన్మానాలు చేస్తాం, అవార్డులు ఇస్తాం... ప్లీజ్ అంటూ అధికారులను బతిమిలాడుకున్నారు. 8 నెలల క్రితమే మంత్రివర్గ ఉపసంఘం వేశారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడటం, పెట్టుబడులను తరిమేయడం తప్ప ఏం సాధించారు?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
అదే వైసీపీ లక్ష్యం!
‘ఇప్పుడీ జీవో 344 వైసీపీ వేధింపులకు పరాకాష్ట. గత 5ఏళ్ల నిర్ణయాలపై మీరు సిట్ వేశారు. మీ 5ఏళ్ల పాలనపై రేపు రాబోయే ప్రభుత్వం సిట్ వేస్తుంది. కక్ష సాధించుకోవడం తప్ప, వీటివల్ల ప్రజలకు ఒరిగేది ఏంటి? వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నా మీద 26 విచారణలు(14 సభా సంఘాలు, 3 ఉపసంఘాలు, 4 న్యాయ విచారణలు, అధికారులతో 4 విచారణలు, 1 సిబిసిఐడి ఎంక్వైరీ..) చేయించారు. ఏమైంది? ఇదీ అంతే! రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసి, పాలనా యంత్రాంగాన్ని డీమొరలైజ్ చేయడమే వైసీపీ లక్ష్యం. సిట్నే పోలీస్ స్టేషన్గా పరిగణిస్తాం అనడం... తాము చెప్పింది చేయని అధికారులను బెదిరించడం, వేధించడం కోసమే. టీడీపీ నేతలపై కక్ష సాధించడమే వైసీపీ అజెండా. తెలుగుదేశం పార్టీ ఏనాడూ ఎటువంటి తప్పులు చేయలేదు. వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదు’ అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
చంద్రబాబు ట్వీట్ల కోసం ఈ లింక్ను క్లిక్ చేయండి