మా వాళ్లు రెడీ.. మీ వాళ్లు రెడీయా?: జగన్కు Chandrababu సవాల్
ABN , First Publish Date - 2021-12-11T19:16:07+05:30 IST
ఏపీకి ప్రత్యేక హోదా కోసం మీ ఎంపీలను రాజీనామా చేయమనండి.. మా ఎంపీలు కూడా రాజీనామా చేస్తారంటూ ఏపీ సీఎం జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు.
అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా కోసం మీ ఎంపీలను రాజీనామా చేయమనండి.. మా ఎంపీలు కూడా రాజీనామా చేస్తారంటూ ఏపీ సీఎం జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ అవకాశవాద రాజకీయాలతో రాష్ట్రం భ్రష్టుపట్టి పోతోందన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రం మెడలు వంచుతామని నాడు జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు ఇప్పుడు ఎందుకు పోరాడరని చంద్రబాబు ప్రశ్నించారు.
ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘హోదాపై ఎందుకు పోరాడలేక పోయారు? ప్రత్యేక హోదా కోసం మీ ఎంపీలను రాజీనామా చెయ్యమనండి. మా ముగ్గురు ఎంపీలు రాజీనామాలు చేస్తారు. హోదా కోసం 25 మంది ఎంపీల రాజీనామాల సవాల్కు జగన్ సమాధానం చెప్పాలి. హోదా వస్తే ఒంగోలు లాంటి పట్టణం హైద్రాబాద్ అవుతుందని నాడు జగన్ అన్నారు. హోదా వస్తే రాష్ట్రమే మారిపోతుందని జగన్ అనలేదా? విశాఖ రైల్వే జోన్ ప్రతిపాదన పరిశీలనలో లేదని కేంద్రం చెబితే ప్రభుత్వం ఏం చేస్తోంది? విభజన హామీల అమలు విషయంలో సీఎం జగన్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. విశాఖకు రాజధాని తెస్తాం అంటున్న జగన్... రైల్వే జోన్ గురించి ఏమి చెబుతారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జగన్కు ముందే సమాచారం ఉంది. విశాఖ ఉక్కు ఒక పరిశ్రమ మాత్రమే కాదు... సెంటిమెంట్. నాడు ఎర్రంనాయుడు పార్లమెంట్లో విశాఖ ఉక్కు కోసం పోరాడారు’’ అని పేర్కొన్నారు.