ఈ సమయంలో రాజకీయాలపై దృష్టి పెట్టడం భావ్యం కాదు: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-04-10T13:59:37+05:30 IST

హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై శ్రద్ద పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్కర సంక్షోభంలో కూడా..

ఈ సమయంలో రాజకీయాలపై దృష్టి పెట్టడం భావ్యం కాదు: చంద్రబాబు

హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై శ్రద్ద పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్కర సంక్షోభంలో కూడా, రాజకీయ ప్రయోజనాలపైనే దృష్టిపెట్టడం భావ్యం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. రాజధాని ప్రాంతంలో ఆర్ 5 జోన్ ఏర్పాటుపై సర్వే చేయడం తగదన్నారు.

అనేక చోట్ల జేసీబీలతో ఇళ్ల స్థలాలను చదును చేయడం, యూనివర్సిటీల పాలకమండళ్ల  నియామకంలో ఒకే సామాజికవర్గం వారిని పెద్దఎత్తున నియమించడం సరికాదన్నారు. ఒకవైపు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో అక్రమ మైనింగ్, గ్రావెల్ తవ్వకాలు, ఇసుక, మట్టి వందలాది లారీల్లో అక్రమ రవాణా చేస్తున్నారని చంద్రబాబు లేఖలో విమర్శించారు. అన్నిచోట్లా దొంగచాటుగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారన్నారు. 


కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యతాయుతంగా సూచనలు చేస్తున్న టీడీపీని, టీడీపీ నాయకులను నిందించడాన్ని మానుకోవాలని కోరుతున్నామన్నారు.


 రాజకీయ ప్రయోజనాల కన్నా, ప్రజా ప్రయోజనాలే మిన్నగా పనిచేయడం ద్వారా ప్రస్తుత కరోనా సంక్షోభంలో నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలన్నారు. తక్షణ ఉపశమన చర్యల ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2020-04-10T13:59:37+05:30 IST