వెంటాడుతున్న కొవిడ్ కష్టాలు
ABN , First Publish Date - 2021-03-21T06:20:58+05:30 IST
కరోనా దెబ్బకు చతికిల పడిన ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఉద్యోగాలు పోయి కోట్ల మంది రోడ్డున పడ్డారు. దమ్మిడీ ఆదాయం లేకపోయినా ఖర్చులు మాత్రం తప్పలేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని ఖర్చులు తప్పడం లేదు
పడిపోయిన గృహ పొదుపు
ఖర్చులతో పెరిగిన అప్పుల భారం
ముంబై: కరోనా దెబ్బకు చతికిల పడిన ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఉద్యోగాలు పోయి కోట్ల మంది రోడ్డున పడ్డారు. దమ్మిడీ ఆదాయం లేకపోయినా ఖర్చులు మాత్రం తప్పలేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని ఖర్చులు తప్పడం లేదు. దాంతో చాలా కుటుంబాలు భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న పొదుపు సొమ్మును సైతం ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ దెబ్బతో జీడీపీలో గృహ పొదుపు వాటా కోసుకు పోయింది. గత ఏడాది మార్చి నెలాఖరుకు జీడీపీలో 21 శాతం వరకు ఉన్న గృహ పొదుపు.. సెప్టెంబరు నెలాఖరుకు 10.4 శాతానికి పడిపోయిందని ఆర్బీఐ తాజా నివేదికలో పేర్కొంది.
3.2 కోట్ల మంది పేదరికంలోకి: కూడబెట్టుకోలేని కుటుంబాలు కొవిడ్తో మరిన్ని కష్టాల పాలయ్యాయి. బంధు మిత్రుల్ని లేదా బ్యాంకులు, ఎన్బీఎ్ఫసీల నుంచి అప్పులు చేయక తప్పలేదు. పెరిగిన నిత్యావసరాల ధరలు గృహ పొదుపునకు మరింత చిల్లు పెట్టాయి. పొదుపు సొమ్ము లేని లేదా చాలినంత మిగులు లేని 3.2 కోట్ల మంది మధ్య తరగతి ప్రజలు పేదరికంలోకి జారిపోయారు. దీంతో కొవిడ్కు ముందు దేశంలో 9.9 కోట్లున్న మధ్య తరగతి జనాభా ప్రస్తుతం 6.6 కోట్లకు పడిపోయిందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది.
తరిగిన ఆస్తులు, పెట్టుబడులు: కరోనా కష్టాలతో ప్రజల వద్ద నగదు తగ్గిపోయింది. గత మార్చి నాటికి ప్రజల వద్దనున్న నగదు జీడీపీలో 5.3 శాతంగా ఉండేది. గత సెప్టెంబరు నాటికి 0.4 శాతానికి పడిపోయింది. మ్యూచువల్ ఫండ్స్, బీమా పథకాల్లో పెట్టుబడులదీ ఇదే పరిస్థితి.