కాంగ్రెస్ నేతల బాహాబాహీ దురదృష్టకరం : భూపేష్ బాఘెల్

ABN , First Publish Date - 2021-10-31T23:34:35+05:30 IST

కాంగ్రెస్ నేతలు బహిరంగంగా జగడానికి దిగడం దురదృష్టకరమని

కాంగ్రెస్ నేతల బాహాబాహీ దురదృష్టకరం : భూపేష్ బాఘెల్

రాయ్‌పూర్ : కాంగ్రెస్ నేతలు బహిరంగంగా జగడానికి దిగడం దురదృష్టకరమని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బాఘెల్ అన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగి ఉండకూడదన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పరిశీలించాలని అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో రైతుల బహిరంగ సభకు హాజరయ్యేందుకు బయల్దేరే ముందు ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. 


ముఖ్యమంత్రి బాఘెల్ ఆదివారం స్వామి వివేకానంద విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు బాహాబాహీకి దిగడం దురదృష్టకరమని చెప్పారు. ఈ సంఘటన జరిగి ఉండకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి సంఘటనలను పరిశీలించాలని తెలిపారు. ఉత్తర ప్రదేశ్ పర్యటన గురించి వివరిస్తూ, గోరఖ్‌పూర్‌లో రైతుల బహిరంగ సభకు తాను హాజరవుతానని చెప్పారు. వరిని అతి తక్కువ ధరకు అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. క్వింటాలు వరి ధాన్యాన్ని రూ.800 నుంచి రూ.1,200 వరకు అమ్ముకోవలసి వస్తోందన్నారు. ధాన్యం సేకరణకు సరైన ఏర్పాట్లు జరగలేదని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్ రైతులు ఆందోళనతో ఉన్నారన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో అమలవుతున్న వ్యవసాయ సంక్షేమ పథకాల పట్ల ఎంతో ఆశతో చూస్తున్నారని తెలిపారు. ఈ పథకాలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ఉత్తర ప్రదేశ్‌ ప్రజలు కోరుతున్నారని చెప్పారు. 


ఛత్తీస్‌గఢ్‌‌లో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. బహిరంగంగానే పోట్లాడుకుంటున్నారు. శనివారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం రాజీవ్ భవన్ పార్కింగ్ వద్ద ఇద్దరు నేతల మధ్య గొడవ జరిగింది. ఈ సంఘటనలో పీసీసీ మాజీ కార్యదర్శి సుశీల్ సన్నీ అగర్వాల్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశారు. 


గత వారం జష్‌పూర్‌లో కూడా కాంగ్రెస్ నేతలు బాహాబాహీకి దిగారు. ముఖ్యమంత్రి బాఘెల్, ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ దేవ్ మధ్య అధికార పంపిణీకి సంబంధించిన ఒప్పందంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగారు. 


సింగ్ దేవ్ మద్దతుదారుపై పోలీసు కేసు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే గత నెలలో నిరసన తెలిపారు. దీంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని బిలాస్‌పూర్ కాంగ్రెస్ విభాగం డిమాండ్ చేసింది.


Updated Date - 2021-10-31T23:34:35+05:30 IST