ప్రియురాలిని మోసగించి మరో యువతితో పెళ్లి

ABN , First Publish Date - 2021-12-01T04:20:23+05:30 IST

ప్రియురాలిని మోసగించి మరో యువతిని పెళ్లాడిన ఓ యువకుడిని మల్కాపురం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

ప్రియురాలిని మోసగించి మరో యువతితో పెళ్లి
మహ్మద్‌ జా (ఫైల్‌ ఫొటో)

బాధితురాలి ఫిర్యాదుతో పోలీసుల అదుపులో యువకుడు

మల్కాపురం, నవంబరు 30 : ప్రియురాలిని మోసగించి మరో యువతిని పెళ్లాడిన ఓ యువకుడిని మల్కాపురం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మల్కాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక జై ఆంధ్రా కాలనీకి చెందిన షేక్‌ మహ్మద్‌ జా అనే యువకుడు ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి వస్తుంటాడు. కాగా జై ఆంధ్రా కాలనీలోనే ఉంటున్న ఒడిశాకు చెందిన ఓ యువతితో ఐదేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు సార్లు ఆమెకు అబార్షన్‌ చేయించాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి అడగడంతో కొంత కాలంగా ముఖం చాటేస్తున్నాడు. అయితే ప్రియురాలికి తెలియకుండా ఆదివారం మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. మంగళవారం గాజువాకలో రిసెప్షన్‌ ఏర్పాటు చేశాడు. ఈ విషయం తెలిసి అతని ప్రియురాలు మల్కాపురం పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా చూపించింది. పోలీసులు రిసెప్షన్‌ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి మహ్మద్‌జాను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అతనిపై కేసు నమోదు చేసి సీఐ దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ మహాలక్ష్మి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-01T04:20:23+05:30 IST