రెండు గంటలకోసారి ఆక్సిజన్‌ నిల్వల చెక్‌ : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-05-13T06:08:06+05:30 IST

జిల్లాలో ఆక్సిజన్‌ వార్‌రూమ్‌ ఏర్పాటుచేసి శిక్షణ ఇచ్చామని, కాబట్టి బాఽధ్యతగా ఆక్సిజన్‌ నిల్వలను ప్రతి రెండు గంటల కోసారి తెలపాలని కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌ బుధవారం ఆక్సిజన్‌ నోడల్‌ అధికారులను ఆదేశించారు.

రెండు గంటలకోసారి ఆక్సిజన్‌ నిల్వల చెక్‌ : కలెక్టర్‌
సమీక్షా సమావేశంలో కలెక్టర్‌, ఎస్పీ తదితరులు

తిరుపతి, మే 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆక్సిజన్‌ వార్‌రూమ్‌ ఏర్పాటుచేసి శిక్షణ ఇచ్చామని, కాబట్టి బాఽధ్యతగా ఆక్సిజన్‌ నిల్వలను ప్రతి రెండు గంటల కోసారి తెలపాలని కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌ బుధవారం ఆక్సిజన్‌ నోడల్‌ అధికారులను ఆదేశించారు.తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో జిల్లావ్యాప్తంగా ఉన్న ఆక్సిజన్‌ నోడల్‌ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.నోడల్‌ అధికారులకు కేటాయించిన ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్స్‌, ఐసీయు బెడ్స్‌,అందుబాటులో ఉన్న బల్క్‌ సిలిండర్ల వివరాలపై దృష్టి సారించాలన్నారు. మదనపల్లె డివిజన్‌లో కనీసం 9గంటలు, తిరుపతి డివిజన్‌లో 6గంటలు, లిక్విడ్‌ గ్యాస్‌ ట్యాంకర్ల విషయంలో 12గంటల నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో లిక్విడ్‌ గ్యాస్‌ వాడుతున్నది తిరుపతిలోని స్విమ్స్‌, రుయా,, అమర ఆస్పత్రులు, చిత్తూరు ప్రభుత్వాస్పత్రి, కుప్పంలోని  పీఈఎస్‌ ఆస్పత్రి మాత్రమేనన్నారు. ట్యాంకర్ల రాక విషయంలో ట్రాకింగ్‌ ఉండాలని, పోలీస్‌గ్రీన్‌ చానల్‌ ఏర్పాటుతో సకాలంలో చేరుకునేలా అప్రమత్తం చేయాల్సి వుంటుందని తెలిపారు. ఆక్సిజన్‌ అవసరాలను రాష్ట్ర స్థాయిలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ అభిషేక్‌కుమార్‌, జీఎండీఐసీ ప్రతాప్‌రెడ్డి మాని టర్‌ చేసి లిక్విడ్‌ గ్యాస్‌ ట్యాంకర్ల రాకను పర్యవేక్షిస్తున్నారని గుర్తు చేశారు. డివిజన్‌ స్థాయిలో సబ్‌కలెక్టర్‌కు, ఆర్డీవోలకు ఆయా ప్రాంతాల ఆక్సిజన్‌ అవసరాలను తెలపాలన్నారు. జేసీ వీరబ్రహ్మం, ఆర్డీవో కనకనరసారెడ్డి మాట్లాడుతూ డేటా సేకరించడానికి రియల్‌ టైం డేటా వుండేలా నోడల్‌ అధికారులకు మంగళవారం శిక్షణ ఇచ్చామన్నారు. వెబ్‌ మాడ్యులర్‌ సిద్ధమవుతోందని, ప్రతి రెండు గంటలకు ఆస్పత్రుల ఆక్సిజన్‌ లెవల్స్‌ అప్‌లోడ్‌ జరగాలని సూచించారు.తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకటఅప్పల నాయుడు మాట్లాడుతూ లిక్విడ్‌ గ్యాస్‌ ట్యాంకర్లు విశాఖ, పెరంబదూర్‌ నుంచి వచ్చే ట్రాకింగ్‌ వివరాలు ట్రాన్స్‌పోర్ట్‌ విభాగానికి అందించాలని, దీంతో తాము ఎస్కార్ట్‌ ఏర్పాటు చేసి అంతరాయం లేకుండా సకాలంలో చేరేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.మదనపల్లె  సబ్‌కలెక్టర్‌ జాహ్నవి, చిత్తూరు ఆర్డీవో రేణుక, పోలీసు, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-13T06:08:06+05:30 IST