నకిలీలకు చెక్
ABN , First Publish Date - 2022-09-29T05:07:42+05:30 IST
బయట ఎంబీబీఎస్ డాక్టర్ పేరు పెట్టుకొని క్లీనిక్ లోపల వైద్యం చేస్తున్న ఆర్ఎంపీలను ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించేది లేదని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.
ఎంబీబీఎస్ పేరుతో వైద్యం చేస్తున్న ఆర్ఎంపీలపై చర్యలు
అనుమతులు లేని ఆస్పత్రులు, అర్హతలేని డాక్టర్లపై నిఘా
రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తున్న జిల్లా అధికారులు
జోగుళాంబ గద్వాల జిల్లాలో 4 ఆస్పత్రుల సీజ్.. ఐదింటికి షోకాజ్ నోటీసులు
సోదాల సమాచారంతో క్లీనిక్లను మూసి వేస్తున్న నిర్వాహకులు
తనిఖీలు ఆపాలని ఒత్తిళ్లు
గద్వాల క్రైం, సెప్టెంబరు 28: బయట ఎంబీబీఎస్ డాక్టర్ పేరు పెట్టుకొని క్లీనిక్ లోపల వైద్యం చేస్తున్న ఆర్ఎంపీలను ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించేది లేదని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా, క్వాలిఫైడ్ డాక్టర్లు, స్టాఫ్ లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు, క్లీనిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్ల మూసివేతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పది రోజుల్లో తనిఖీలు చేపట్టాలని రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు జోగుళాంబ గద్వాల జిల్లాలో మూ డు రోజుల నుంచి వైద్యాధికారుల బృం దాలు సోదాలు చేప డుతున్నాయి.
186 ఆస్పత్రులు
జోగుళాంబ గద్వాల జిల్లాలో 186 ప్రైవేట్ క్లినిక్లు, ఆస్పత్రులు ఉన్నాయి. అందులో ఆస్పత్రులు 37, క్లీనిక్లు 19, డెంటల్ క్లీనిక్లు 15, ఫిజియోథెరఫీ క్లీనిక్లు 5, డయాగ్నోస్టిక్ సెంటర్లు 86, స్కాన్ సెంటర్లు 24 ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతు న్నారు. వాటిలో 10 రోజుల్లో తనిఖీలు నిర్వహించేందుకు అఽధికారులు సమాయత్తం అయ్యా రు. డీఎంహెచ్వో చందూ నాయక్తో పాటు నాలుగు బృందాలు తనిఖీలు చేపడుతున్నాయి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్నదా?, ఆస్పత్రులు నిబంధనల ప్రకారం ఉన్నా యా? అనే విషయాలపై తనిఖీలు చేస్తున్నారు.
ముందస్తు సమాచారంతో..
ఆస్పత్రుల్లో తనిఖీలు చేస్తున్నారన్న సమాచారాన్ని కొందరు వైద్యాధికారుల ద్వారా ముందే తెలుసుకుంటున్న పలువురు అన్క్వాలిఫైడ్ డాక్లర్లు అనుమతి లేని క్లీనిక్లను మూసి వేస్తున్నారు. ఆస్పత్రులను మూసి వేసినా తనిఖీలు చేసి తీరుతామని డీఎంహెచ్వో చెబుతున్నారు.
మూడు రోజుల్లో 40 ఆస్పత్రుల తనిఖీ
జిల్లాలో మూడు రోజుల నుంచి 40 ఆస్పత్రుల్లో తనిఖీలు చేయగా, అందులో నాలుగు ఆస్పత్రులను సీజ్ చేశారు. ఐదింటికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డీఎంహెచ్వో చందూనాయక్ చెప్పారు. గద్వాలలోని లక్ష్మీ వెంకటేశ్వర క్లీనిక్తో పాటు అయిజలోని సన్రైజ్ ఆస్పత్రి, సత్యనారాయణ చైల్డ్ క్లీనిక్, పుష్పనర్సింగ్ హోమ్, స్రవంతి కీనిక్లకు నోటీసులు ఇవ్వగా, గద్వాలలోని వెంకటరమణ్ క్లీనిక్, బాబా క్లీనిక్, ఆర్ఎంపీ విజయ్ క్లీనిక్, అయిజలోని బాలాజీ ఆస్పత్రులను సీజ్ చేసినట్లు తెలిపారు.
ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు
వైద్య బృందాలు మూడు రోజులుగా తనిఖీలు చేస్తుండటంతో క్లీనిక్లు నిర్వహిస్తున్న అన్క్వాలిఫైడ్ డాక్టర్లు, ఆర్ఎంపీలు, అనుమతులు లేని యాజ మాన్యాలు తనిఖీలను ఆపాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై కొందరు ఏకంగా ఓ మంత్రి ద్వారా, ప్రజా ప్రతినిధుల ద్వారా వైద్య సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఆ క్లీనిక్ జోలికి వెళ్లకు.. అది మా వాళ్లదే.. అంటూ ఒత్తిళ్లు వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు
జోగుళాంబ గద్వాల జిల్లాలో అనుమతిలేని ఆస్పత్రులతో పాటు అన్క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్న దవాఖానాలను సీజ్ చేస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు చేపడుతున్నాం. ప్రజలు కూడా ఆలోచించి అన్ని అర్హతలు ఉన్న వైద్యుల వద్దకే చికిత్స కోసం వెళ్లాలి.
- చందూనాయక్, డీఎంహెచ్వో, గద్వాల.