శాసనమండలి ఏర్పాటుకు సన్నాహాలు

ABN , First Publish Date - 2021-07-26T16:35:00+05:30 IST

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు శాసనమండలికి ఊపిరి పోసేందుకు డీఎంకే ప్రభుత్వం సన్నాహాల్లోకి దిగింది. ఇందులో భాగంగా వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లోనే మండలి ఏర్పాటుకు సంబంధించిన ...

శాసనమండలి ఏర్పాటుకు సన్నాహాలు

బడ్జెట్‌ సమావేశాల్లో తీర్మానం చేసే అవకాశం


చెన్నై: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు శాసనమండలికి ఊపిరి పోసేందుకు డీఎంకే ప్రభుత్వం సన్నాహాల్లోకి దిగింది. ఇందులో భాగంగా వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లోనే మండలి ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఆమోదించేందుకు అనువుగా ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్ర శాసనమండలికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన రాజాజీ, అన్నాదురై శాసనమండలి సభ్యులుగా ఉన్నారు. రద్దు సమయంలో శాసనమండలి స్పీకర్‌గా మాపోసి వ్యవహరించగా, ప్రతిపక్ష నేతగా కరుణానిధి ఉన్నారు. ఆ సమయంలో మండలి సభ్యురాలిగా వెన్నిరాడై నిర్మల నియామకం వివాదాస్పదమైంది. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన ఎంజీఆర్‌ 1986లో మండలినే రద్దు చేశారు. ఈ నేపథ్యంలో 35 ఏళ్ల అనంతరం మళ్లీ శాసనమండలి పునరుద్ధరణకు చర్యలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెలలో జరుగనున్న శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో శాసనమండలి ఏర్పాటుపై తీర్మానం నెరవేర్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అంతకు ముందు స్టాలిన్‌ నేతృత్వంలో మంత్రివర్గం సమావేశం నిర్వహించి శాసనమండలి ఏర్పాటును ఆమోదించి, శాసనసభ సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం పొందేలా ప్రభుత్వం పావులు కదుపుతోంది. నిజానికి 1989లో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే శాసనమండలి పునరుద్ధరణపై తీర్మానం ప్రవేశపెట్టేందుకు యత్నించారు.


కానీ, ఎల్‌టీటీఈ వ్యవహారంలో ప్రభుత్వం రద్దు కావడంతో ఆయన ఆశ నెరవేరలేదు. మళ్లీ 2006 డీఎంకే హయాంలో తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి పంపారు. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండడంతో అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభల్లో రాష్ట్రప్రభుత్వ తీర్మానాన్ని ఆమోదించారు. కానీ అది ఆచరణరూపం దాల్చలేదు. 2011లో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారం చేపట్టడంతో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీలో అంతకు ముందు ఆమోదించిన తీర్మానాన్ని రద్దుచేశారు. ఎంజీఆర్‌ రద్దు చేసిన శాసన మండలిని మళ్లీ పునరుద్ధరించడం జయకు ఇష్టం లేదని అన్నాడీఎంకే ప్రకటించింది. కాగా డీఎంకే గతంలో అధికారంలో ఉన్న సమయంలో మూడుసార్లు తీర్మానం చేసినా అప్పటి పరిస్థితుల కారణంగా శాసన మండలి ఏర్పాటు సాధ్యం కాలేదు. కానీ ఈసారి దీనిని స్టాలిన్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కేంద్రాన్ని ఒప్పించి మండలి ఏర్పాటును ఆమోదించుకునేలా ప్రయత్నాలు చేపట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మండలి ఏర్పాటైతే స్థానిక సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయుల ప్రతినిధులు, గవర్నర్‌ ప్రతినిధులు, ఎమ్మెల్యేల ప్రతినిధులు.. ఇలా మొత్తం 60 మంది సభ్యులతో శాసన మండలి ఏర్పాటయ్యే అవకాశముంది. అయితే ప్రభుత్వం అనుకున్నట్లుగా సన్నాహాలు పూర్తయినా వచ్చే ఏడాదే మండలి ఏర్పాటు సాధ్యమని తెలుస్తోంది. 

Updated Date - 2021-07-26T16:35:00+05:30 IST