ధోనీ సేన ఈ వారమంతా ఐపీఎల్‌కు దూరమేనా?

ABN , First Publish Date - 2021-05-04T17:19:01+05:30 IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

ధోనీ సేన ఈ వారమంతా ఐపీఎల్‌కు దూరమేనా?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. సోమవారం జరగాల్సిన కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్ వాయిదా పడింది. ఈ వారంలో ఇంకా ఎన్ని మ్యాచ్‌లు వాయిదా పడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. బుధవారం జరగాల్సిన రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ మ్యాచ్ కూడా జరగదని అంటున్నారు. 


చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీకి కరోనా పాజిటివ్‌గా సోమవారం నిర్ధారణ అయింది. అప్పటివరకు అతను చెన్నై టీమ్‌తో కలిసి ఉన్నాడు. మొన్నటి మ్యాచ్‌లో డగౌట్‌లో కూడా కనిపించాడు. దీంతో చెన్నై టీమ్ మొత్తం వారం రోజుల పాటు కఠిన క్వారంటైన్‌లో ఉండనుంది. ఈ సమయంలో టీమ్ సభ్యులు ఎవ్వరినీ కలిసేందుకు వీల్లేదు. ఈ వారంలో చెన్నై మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. బుధవారం రాజస్థాన్‌ రాయల్స్‌‌తోనూ, శుక్రవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌‌తోనూ, ఆదివారం పంజాబ్‌ కింగ్స్‌తోనూ తలపడాల్సి ఉంది. వారం రోజుల క్వారంటైన్‌ నేపథ్యంలో చెన్నై ఈ మూడూ మ్యాచ్‌లకూ దూరమైనట్టే. ఈ మ్యాచ్‌లను రీ షెడ్యూల్ చేయాలని ఐపీఎల్ యాజమాన్యం భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-05-04T17:19:01+05:30 IST