చెత్త భారం

ABN , First Publish Date - 2020-11-13T06:08:21+05:30 IST

ఘన వ్యర్థాల నిర్వహణ పేరుతో నగర వాసుల నెత్తిన గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) అదనపు భారం మోపబోతోంది.

చెత్త భారం

ఇకపై యూజర్‌ చార్జీలు పక్కాగా వసూలు

జీవీఎంసీ నిర్ణయం

ఫ్లాట్‌కు రూ.50, కల్యాణ మండపాలకు రూ.వెయ్యి

వాణిజ్య సముదాయాలకు రూ.1,500

హోటళ్లు, షాపింగ్‌మాల్స్‌కు రూ.5,000 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఘన వ్యర్థాల నిర్వహణ పేరుతో నగర వాసుల నెత్తిన గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) అదనపు భారం మోపబోతోంది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌  మార్గదర్శకాలకు అనుగుణంగా యూజర్‌ చార్జీలు వసూలు చేయనున్నట్టు అధికార యంత్రాంగం చెబుతోంది. ఈ మేరకు మూడు నెలల కిందటే ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ...తాజాగా వసూళ్లకు శ్రీకారంచుట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవడం నగర వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.


పట్టణాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన మార్గదర్శకాలను జారీచేసింది. అందులో భాగంగా చెత్త సేకరణ, నిర్వహణ నిమిత్తం యూజర్‌ చార్జీలు వసూలు చేసుకునే అవకాశం స్థానిక సంస్థలకు కల్పించింది. దీని ప్రకారం నగరంలోని అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలతోపాటు సినిమాహాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, కల్యాణ మండపాలు, హోటళ్లు వంటి వాణిజ్య సముదాయాల నుంచి ఉత్పత్తి అయ్యే చెత్తను తడి, పొడిగా విభజించడంతోపాటు సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలించేందుకు యూజర్‌ చార్జీలను వసూలు చేయాలని జీవీఎంసీ అధికారులు కొన్నాళ్ల కిందట నిర్ణయించి, ఉత్తర్వులు జారీచేశారు. నెలకు అపార్టుమెంట్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఒక్కో ఫ్లాట్‌ నుంచి రూ.50, కల్యాణ మండపాల నుంచి రూ.వెయ్యి, సినిమా థియేటర్లు, ఇతర వాణిజ్య సముదాయాలకు రూ.1,500, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌ నుంచి రూ.ఐదు వేలు చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఇప్పటివరకూ కాస్త మెతకగానే వ్యవహరిస్తూ వచ్చారు. కానీ యూజర్‌ చార్జీల చెల్లింపు తప్పనిసరి అన్నట్టుగా రెండు రోజుల క్రితం జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన సంకేతాలిచ్చారు.  


నెలకు రూ.10 కోట్లుపైనే భారం

జీవీఎంసీ పరిధిలో సుమారు ఆరు లక్షల వరకూ అసెస్‌మెంట్లు ఉన్నాయి. వీటిలో అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు ఐదు వేల వరకూ ఉంటాయి. ఒక్కో అపార్టుమెంట్‌, గేటెడ్‌ కమ్యూనిటీల్లో సగటున 20 ఫ్లాట్లు వేసుకున్నా లక్ష వరకూ ఉంటాయి. ఒక్కో ఫ్లాట్‌ నుంచి రూ.50 చొప్పున లెక్కేసుకుంటే రూ.50 లక్షలు వసూలవుతుంది. అలాగే హోటళ్లు, షాపింగ్‌మాల్స్‌, సినిమా థియేటర్లు, కల్యాణ మండపాలు వంటి కమర్షియల్‌ అసెస్‌మెంట్లు లక్ష వరకూ ఉంటాయి. వీటి నుంచి సగటున రూ.వెయ్యి చొప్పున లెక్కిస్తే రూ.పది కోట్లు వస్తుంది.


ఆస్తిపన్ను కడుతుంటే కొత్తగా యూజర్‌ చార్జీలు ఎందుకు?

- పి.వెంకటరెడ్డి, సీఐటీయూ, నగర అధ్యక్షుడు

నగరంలో ఫ్లాట్ల యజమానులతోపాటు దుకాణాలు, షాపింగ్‌మాల్స్‌, హోటళ్లు, కల్యాణ మండపాలు వంటి వాణిజ్య సముదాయాలన్నీ జీవీఎంసీకి ఆస్తిపన్ను చెల్లిస్తున్నాయి. అలాంటప్పుడు వారికి అవసరమయ్యే మౌలిక వసతులను జీవీఎంసీయే కల్పించాల్సి ఉంటుంది. కొత్తగా సంస్కరణల పేరుతో యూజర్‌ చార్జీలు వసూలు చేయడాన్ని సీఐటీయూ వ్యతిరేకిస్తోంది. ఇది ప్రజలకు భారంగా మారుతుంది.

Updated Date - 2020-11-13T06:08:21+05:30 IST