నాయకత్వ మార్పు ఊహాగానాలు.. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిసిన ఛత్తీస్‌గఢ్ సీఎం

ABN , First Publish Date - 2021-07-11T23:19:28+05:30 IST

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను ఆదివారం..

నాయకత్వ మార్పు ఊహాగానాలు.. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిసిన ఛత్తీస్‌గఢ్ సీఎం

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను ఆదివారం కలుసుకున్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరుగనుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో బాగెల్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ అగ్రనాయకులను కలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు నాలుగింట మూడోవంతు మెజారిటీ ఉందని చెప్పారు. నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలపై మాట్లాడుతూ, అధిష్ఠానం ఆదేశంతోనే తాను సీఎంగా ప్రమాణ ప్రమాణస్వీకారం చేశానని, వేరొకరిని ముఖ్యమంత్రిగా అనుకుంటే ఆ విధంగానే జరుగుతుందని, సంకీర్ణ ప్రభుత్వాల్లో ఇలాంటివి సహజమేనని చెప్పారు.


మేడమ్‌ (సోనియాగాంధీ)ను కలుసుకోలేదని, అయితే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిసి మాట్లాడానని ఆయన చెప్పారు. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి పీఎల్ పునియా, కేసీ వేణుగోపాల్‌ను కూడా కలుస్తానని తెలిపారు. వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతను చేపట్టేందుకు కూడా తాను సిద్ధమేనని చెప్పారు.

Updated Date - 2021-07-11T23:19:28+05:30 IST