చుక్కల్లో చికెన్.. వారంలో కేజీపై రూ.60 పెరుగుదల
ABN , First Publish Date - 2020-09-04T18:56:53+05:30 IST
కోడి కొక్కొరోకో అంటోంది.. తెల్లవారుజామున జనం లేవడానికి కాదు.. ధరల రూపంలో చుక్కల్లో చేరానంటూ కూత పెడుతోంది. కేవలం వారం రోజుల్లోనే చికెన్ ధర కేజీపై రూ.60 పెరిగింది. కరోనా కాలంలో మాంసాహారానికి డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే
కడప (సిటి): కోడి కొక్కొరోకో అంటోంది.. తెల్లవారుజామున జనం లేవడానికి కాదు.. ధరల రూపంలో చుక్కల్లో చేరానంటూ కూత పెడుతోంది. కేవలం వారం రోజుల్లోనే చికెన్ ధర కేజీపై రూ.60 పెరిగింది. కరోనా కాలంలో మాంసాహారానికి డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. కిలో మాంసం రూ.700 నుంచి రూ.800 వరకు విక్రయిస్తుంటే అధిక శాతం మాంసం ప్రియులు చికెన్ వైపు ఆకర్శితులయ్యారు. దుకాణాల వ్యాపార సముదాయాల్లో తేడాలు వస్తున్నా.. చికెన్ వ్యాపారం బాగానే కొనసాగుతూ వచ్చింది. కాగా గత వారం కిలో రూ.140 నుంచి రూ.160 మేర సాగిన అమ్మకాలపై రూ.60 పెరిగింది. స్కిన్తో కిలో రూ.140 ఉన్న చికెన్ ప్రస్తుతం రూ.200లకు, స్కిన్లె్స రూ.160 నుంచి రూ.220కి చేరుకుంది.
కడప జిల్లాలో కోళ్ల ఫారాలు అతి తక్కువ. దీంతో చిత్తూరు సహా ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటూ వస్తున్నారు. కరోనా దెబ్బకు కోళ్లకు దాణా అందక రవాణా సౌకర్యం సరిగా లేక దిగుమతి కష్టతరమవుతోంది. పది రోజులుగా దిగుమతి బాగా తగ్గిందని, దీంతో ధరలు బాగా పెరుగుతున్నాయని కొందరు విక్రయదారులు చెప్పుకొస్తున్నారు. అయితే ఫారం యజమానులు కరోనాతో వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు కృత్రిమ డిమాండ్ను సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. ఏదిఏమైనా కోడి ధరల కూత సన్నగిల్లుతుందో.. మరింత రెచ్చిపోతుందో మరో రెండు మూడు రోజుల్లో తేలనుంది.