రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

ABN , First Publish Date - 2021-03-02T06:06:46+05:30 IST

చిలకలూరిపేటసబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

 చిలకలూరిపేటలో రూ.80,120 నగదు సీజ్‌

 

చిలకలూరిపేట టౌన్‌, మార్చి 1: చిలకలూరిపేటసబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ గుంటూరు-1 డీఎస్పీలు వెంకట్రావు, ఏసీబీ గుంటూర్‌ ప్రతాప్‌కుమార్‌, శ్రీధర్‌, రవిబాబు, నాగరాజు, ఎస్‌ఐ శ్రీనివాసమూర్తి, సిబ్బంది సాయత్రం 4 గంటల సమయంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్దకు వచ్చి లోపలకు వెళ్లి తలుపులు వేశారు. రెండు గంటలపాటు తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ  నిబంధనల ప్రకారం కార్యాలయంలోకి డాక్యుమెంట్‌ రైటర్లను అనుమతించడానికి వీల్లేదన్నారు. అందుకు విరుద్ధంగా లోపల 10మంది డాక్యుమెంట్‌ రైటర్లు ఉండటం గుర్తించామన్నారు. ఎస్‌కే సులేమాన్‌,  రషీద్‌,  వాహిద్‌ అనే అన్నదమ్ములు అనధికారికంగా ఉద్యోగులుగా పనిచేయడాన్ని గుర్తించామన్నారు. డాక్యుమెంట్‌ రైటర్ల వద్ద రూ.58,210,  ప్రైవేటు ఉద్యోగుల వద్ద రూ.21,910 మొత్తం రూ.80,120లు సీజ్‌ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్‌ చేస్తే గుంటూరు ఏసీబీ కార్యాలయం నంబరు 9491305638 నంబరుకు ఫోన్‌ చేస్తే ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-03-02T06:06:46+05:30 IST