భారత్‌కు మోకాలడ్డుతున్న చైనా..?

ABN , First Publish Date - 2020-02-22T18:02:46+05:30 IST

సహాయం చేస్తామంటున్న భారత్.. మోకాలడ్డుతున్న చైనా..?

భారత్‌కు మోకాలడ్డుతున్న చైనా..?

న్యూఢిల్లీ: కొవిడ్-19(కరోనా) దెబ్బతో చైనా అతలాకుతలమైపోతోంది. మరోవైపు.. కష్టాల్లో ఉన్న పొరుగు దేశానికి తన వంతు సాయం చేయాలని భావించిన భారత్.. ఆపన్న హస్తం అందించింది. చైనాకు సంఘీ భావం తెలుపుతూ ..భారత ప్రధాని దేశ ప్రజల తరఫున ఓ లేఖ రాశారు. ఎటువంటి సహాయం చేయడానికైనా సిద్ధం అని హామీ ఇచ్చారు. ఈ హామీని నిలబెట్టుకుంటూ చైనాకు అవసరమైన మందులు, ఇతర వైద్య సామాగ్రిని ప్రత్యేక సైనిక రవాణా విమానం(సీ-17 గ్లోబ్ మాస్టర్) ద్వారా పంపించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విమానం ఫిబ్రవరి 20న ఢిల్లీ నుంచి బయలుదేరాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో.. చైనాలో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తరలించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.


కారణం.. చైనా నుంచి అవసరమైన అనుమతులు రాకపోవడమే. ఈ విషయంలో భారత అధికారులు చైనాతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. చైనా మాత్రం.. మా తరఫునుంచి ఎటువంటి ఆలస్యం లేదని చెబుతూనే ఉంది. దీంతో చైనా ఉద్దేశపూర్వకంగానే భారత్‌కు మోకాలడ్డుతోందా అనే అనుమానం రేకెత్తుతోంది. ఈ విషయంపై భారత ప్రభుత్వ ఉన్నత వర్తాలు ఈ విధంగా స్పందిస్తున్నాయి. 


‘కొవిడ్-19 కారణంగా ఇబ్బందులు పడుతున్న చైనాకు భారత ప్రధాని దేశ ప్రజల తరఫున సంఘీభావం తెలుపుతూ ఇటీవల ఓ లేఖ రాశారు. మరోవైపు భారత, చైనా దౌత్యసంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ప్రధాని.. తను ఇచ్చిన మాటను నెలబెట్టుకుంటూ చైనా కోసం ఓ ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేశారు. దాని ద్వారా చైనాకు అవసరమైన మాస్క్‌లు, డీఫ్రిబ్రిల్లేటర్స్, ఇన్‌ఫ్యూజన్ పంపులు, ఇతర వైద్య పరికరాలు పంపించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీటి విషయంలో భారత్ కొరత ఎదుర్కొంటున్నప్పటికీ మన ప్రభుత్వం చైనాను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది.


మరోవైపు.. స్వదేశానికి ఎప్పుడు తిరిగి వస్తామా అంటూ చైనాలోని భారతీయులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ అనుమతుల విషయంలో జరుగుతున్న ఆలస్యం కారణంగా వారితో పాటు భారత్‌లోని వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఇతర దేశాలకు చెందిన విమానాలు మాత్రం  యథావిథిగా చైనా నుంచి విదేశస్తులను తరలిస్తున్నాయి. మరి భారత్‌కు అనుమతులు మంజూరు చేయడంలో ఎందుకు తాత్సారం జరుగుతోంది. స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న వారికి ఎందుకు ఇంతటి మానసిక వేదన కలిగిస్తున్నారు.’ అని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. 

Updated Date - 2020-02-22T18:02:46+05:30 IST