కొత్త భూ సరిహద్దు చట్టానికి చైనా ఆమోదం

ABN , First Publish Date - 2021-10-24T20:23:54+05:30 IST

భారత దేశంతో సరిహద్దు వివాదంపై ప్రభావం చూపగలిగే

కొత్త భూ సరిహద్దు చట్టానికి చైనా ఆమోదం

బీజింగ్ : భారత దేశంతో సరిహద్దు వివాదంపై ప్రభావం చూపగలిగే కొత్త చట్టాన్ని చైనా నేషనల్ లెజిస్లేచర్ ఆమోదించింది. చైనా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత అత్యంత పవిత్రమైనవి, అనుల్లంఘనీయమైనవి అని ఈ చట్టం చెప్తోంది. భూమి సరిహద్దు ప్రాంతాల పరిరక్షణ, వినియోగం కోసం ఈ చట్టాన్ని రూపొందించింది. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్థాయీ సంఘం సభ్యులు శనివారం లెజిస్లేటివ్ సెషన్ ముగింపు సమావేశంలో ఈ చట్టం ఆమోదం పొందింది. 


ఈ కొత్త చట్టం వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని చైనా మీడియా తెలిపింది. చైనా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత అత్యంత పవిత్రమైనవి, అనుల్లంఘనీయమైనవని పేర్కొంది. ప్రాదేశిక సమగ్రత, భూమి సరిహద్దులను కాపాడటం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ చట్టం చెప్తోంది. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం, భూ సరిహద్దులకు విఘాతం కలిగించే ఎటువంటి చర్యలపైన అయినా పోరాడాలని తెలిపింది. సరిహద్దుల్లో రక్షణను పటిష్టపరచాలని, సాంఘిక, ఆర్థికాభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సరిహద్దు ప్రాంతాలను తెరవడం, ప్రభుత్వ సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజల జీవితం, జీవనోపాధి కోసం కూడా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇరుగు, పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపింది. సమానత్వం, పరస్పర నమ్మకం, స్నేహపూర్వక సంప్రదింపుల సిద్ధాంతాలను అనుసరించి ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనాలని పేర్కొంది. 


భారత దేశం, భూటాన్‌లతో చైనా సరిహద్దు ఒప్పందాలను ఖరారు చేసుకోవలసి ఉంది. ఇప్పటి వరకు 12 పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలను చైనా పరిష్కరించుకుంది. 


Updated Date - 2021-10-24T20:23:54+05:30 IST