తాలిబన్లపై చైనా పొగడ్తలు

ABN , First Publish Date - 2021-08-20T01:58:52+05:30 IST

తాలిబన్లు రెండు దశాబ్దాల క్రితంతో పోల్చితే

తాలిబన్లపై చైనా పొగడ్తలు

బీజింగ్ : తాలిబన్లు రెండు దశాబ్దాల క్రితంతో పోల్చితే, ఇప్పుడు మరింత తర్కబద్ధంగా ఆలోచించేవారుగా, హేతుబద్ధంగా ప్రవర్తించేవారుగా కనిపిస్తున్నారని చైనా పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్‌లో వేగంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ శక్తులు మరింత నిష్పాక్షికంగా వ్యవహరించాలని పిలుపునిచ్చింది. తాలిబన్లతో తాను చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. 


చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ, ఓ సమస్య పట్ల వ్యవహరించేటపుడు కేవలం గతంలో జరిగినదానిపైనే ఆధారపడకూడదని, ప్రస్తుతం ఏం జరుగుతోందో చూడాలని అన్నారు. ఏం చెప్పారో వినడం ద్వారా మాత్రమే కాకుండా, ఏం చేస్తున్నారో పరిశీలించడం ద్వారా కూడా ఇది జరుగుతుందన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌పై గతంలో బయటి ప్రపంచం ఇచ్చిన తీర్పుల్లో నిష్పాక్షికత లేకపోవడాన్ని, ఆ దేశంలో ప్రజాభిప్రాయాన్ని నిర్దిష్టంగా గుర్తించలేకపోవడాన్ని ప్రస్తుతం ఆ దేశంలో వేగంగా మారుతున్న పరిస్థితి వెల్లడిస్తోందన్నారు. 


ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తాలిబన్లు చెప్తున్నారన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామంటున్నారన్నారు. విశాల దృక్పథంతో సమ్మిళిత ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని చెప్తున్నారని తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం అధికారంలో ఉన్నప్పటి కన్నా ఇప్పుడు తాలిబన్లు మరింత హేతుబద్ధంగా, తర్కబద్ధంగా ఆలోచిస్తున్నారని చెప్పారు. వారు చరిత్రను పునరావృతం చేయబోరన్నారు. 


Updated Date - 2021-08-20T01:58:52+05:30 IST