భారత్‌తో వివాద ప్రాంతంలో చైనా సైన్యానికి మరిన్ని సదుపాయాలు

ABN , First Publish Date - 2021-11-10T19:33:55+05:30 IST

భారత దేశంతో సరిహద్దుల్లో వివాదంలో ఉన్న

భారత్‌తో వివాద ప్రాంతంలో చైనా సైన్యానికి మరిన్ని సదుపాయాలు

న్యూఢిల్లీ : భారత దేశంతో సరిహద్దుల్లో వివాదంలో ఉన్న ప్రాంతంలో సదుపాయాలను చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) పటిష్టపరిచిందని చైనా ప్రభుత్వ మీడియా బుధవారం వెల్లడించింది. స్వల్ప స్థాయి ఘర్షణలు జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో చలికాలం రావడానికి ముందే తమ సైనికుల కోసం వీటిని పటిష్టపరిచినట్లు తెలిపింది. 


భారత్-చైనా సరిహద్దుల్లో చలి కాలంలో విస్తృత స్థాయి ఘర్షణలు జరిగే అవకాశం లేకపోయినప్పటికీ, స్వల్ప స్థాయిలో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని, దీనికి పీఎల్ఏ సిద్ధంగా ఉండాలని, అందుకే ఈ నిర్మాణాలను చేపట్టినట్లు చైనా ప్రభుత్వ పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ పేర్కొంది. ఘర్షణలతోపాటు చలికాలంలో ఎదురయ్యే తీవ్రమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సరుకులు, ఇతర ఉత్పత్తులు, ఆయుధాలు వంటివాటి సరఫరా మార్గాలను బలోపేతం చేసినట్లు వివరించింది. ఇటీవల చైనా సైనిక వ్యవస్థల్లో కూడా దీనికి సంబంధించిన సమాచారం కనిపించింది. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి పీఎల్ఏ దళాలు సుదీర్ఘ కాలం ఉండటం కోసం తగిన చర్యలు చేపడుతున్నట్లు ఈ కథనాలు పేర్కొన్నాయి. చలికాలంలో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోయినపుడు కూడా చైనా సైనికులు తమ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడానికి వీలైన సదుపాయాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నాయి. సైనికులు చలిని తట్టుకునేందుకు కొత్త రకం స్వెట్టర్లను అందించినట్లు తెలిసింది. చలికి గడ్డ కట్టుకుపోయే పరిస్థితుల్లో కూడా వీటిని ధరించే సైనికులు సక్రమంగా తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు వీలవుతుందని సమాచారం. 


భారత్-చైనా మధ్య తూర్పు లడఖ్‌లో 2020 మే నుంచి ప్రతిష్టంభన ఏర్పడిన సంగతి తెలిసిందే. పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో ఇరు సైన్యాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య అనేక దఫాలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ దళాల ఉపసంహరణ పాక్షికంగానే జరిగింది. 


Updated Date - 2021-11-10T19:33:55+05:30 IST