చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనం

ABN , First Publish Date - 2021-11-28T16:39:40+05:30 IST

చిత్తూరు: జిల్లాలో వరుస భూప్రకంపనలు కలకలం రేపుతున్నాయి.

చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనం

చిత్తూరు: జిల్లాలో వరుస భూప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. పలమనేరు మండలం, కరడిమడుగులో అర్ధరాత్రి భారీ శబ్దంతో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రంతా రోడ్డుపై బిక్కు బిక్కుమంటూ గడిపారు. అధికారులకు సమాచారం అందించినట్లు స్థానికులు తెలిపారు.


శనివారం మధ్యాహ్నం రామకుప్పం మండలం, గడ్డూరు తదితర గ్రామాల్లో భూప్రకంనలు వచ్చాయి. సమాచారం అందుకున్న జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి భూప్రకంపనలు సంభవించిన గ్రామాల్లో పర్యటించారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుండటం వల్ల ప్రకంపనలు వచ్చి ఉండవచ్చన్నారు. ఏదేమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఆయన పీఏ మనోహర్‌, స్థానిక టీడీపీ నేతలతో కలిసి భూప్రకంపనలు చోటుచేసుకున్న గడ్డూరు, చిన్నగెరిగెపల్లె, పెద్దగెరిగెపల్లె, గోరివిమాకులపల్లెల్లో పర్యటించారు. ఎవరూ ఆందోళన చెందరాదని, అన్ని వేళలా అండగా ఉంటామన్నారు. ప్రజలకు భోజనపొట్లాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార యంత్రాంగం భూప్రకంపనలకు కారణాలు వెలికి తీసి, ప్రజల్లో భరోసా కల్పించాలన్నారు.

Updated Date - 2021-11-28T16:39:40+05:30 IST