అమెరికాలో చిత్తూరు జిల్లా మహిళ మృతి !

ABN , First Publish Date - 2020-12-05T14:18:46+05:30 IST

పూతలపట్టు మండలానికి చెందిన ఓ వివాహిత అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

అమెరికాలో చిత్తూరు జిల్లా మహిళ మృతి !
భర్త సుధాకర్‌తో ప్రేమలత..

ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబీకులకు సమాచారం

భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్న మృతురాలి బంధువులు

తిరుపతి(ఆంధ్రజ్యోతి): పూతలపట్టు మండలానికి చెందిన ఓ వివాహిత అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కటారి ప్రేమలత (32) అమెరికాలోని న్యూజెర్సీలో ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబసభ్యులకు సమాచారం అందగా.. యువతి బంధువులు మాత్రం భర్తపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి బంధువుల కథనం మేరకు.. బందార్లపల్లెకు చెందిన కటారి త్యాగరాజనాయుడు కుమార్తె ప్రేమలత ఎంటెక్‌ పూర్తి చేసి ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తుండేది. 2016లో చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలోని మల్లయ్యగారిపల్లెకు చెందిన సుధాకర్‌తో తిరుమలలో వివాహం జరిగింది. అప్పటికే అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా సుధాకర్‌ పనిచేస్తున్నాడు. వివాహమైన 20 రోజులకే భర్త వెంట ప్రేమలత అమెరికా వెళ్లారు. ప్రస్తుతం వారికి రెండున్నరేళ్ల కుమారుడు గీతాంజ్‌ ఉన్నాడు. ఆ క్రమంలో ఈనెల ఒకటో తేది రాత్రి ప్రేమలత ఆత్మహత్యకు పాల్పడిందంటూ అమెరికా నుంచి తండ్రి త్యాగరాజనాయుడుకు సమాచారం అందింది. 


మృతదేహాన్ని ఇక్కడికి పంపించాలని తండ్రి కోరుతున్నా సుధాకర్‌ నుంచి సరైన సమాధానం రావడం లేదని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. భార్యాభర్తల నడుమ గొడవలున్నాయని, గతంలో అమెరికాలోనే భర్తపై ప్రేమలత పోలీసులకు ఫిర్యాదు చేసిందనీ వారు చెబుతున్నారు. మరోసారి భర్త నుంచి వేధింపులు ఎదురైతే ఆమెను ఇండియాలో తండ్రి వద్దకు పంపుతామని పోలీసులు చెప్పడంతో ఆమె పాస్‌పోర్టు లాక్కున్నాడని కూడా చెబుతున్నారు. తనకు ఉద్యోగం వచ్చిందని, జనవరి 10న చేరబోతున్నానని కూడా తమకు చెప్పిందంటున్నారు బంధువులు. రెండున్నరేళ్ళ కుమారుడు ఉండటం, వచ్చే నెల ఉద్యోగంలో చేరేందుకు సిద్ధపడిన నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఆమెకు లేదని బంధువులు వాదిస్తున్నారు. ఆమె మృతికి భర్తే కారణమంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమలత మృతదేహాన్ని ఇండియాకు పంపాలని కోరుతూ స్థానికంగా పోలీసు అధికారులను ఆశ్రయిస్తామని వారు తెలిపారు.  

Updated Date - 2020-12-05T14:18:46+05:30 IST