జడ్పీలో సీఐడీ విచారణ

ABN , First Publish Date - 2021-11-27T06:30:02+05:30 IST

జడ్పీ అక్రమాలపై సీఐడీ అధికారులు విచారణ చేశారు. శుక్రవారం స్థానిక జడ్పీలోని సీఈఓ భాస్కర్‌రెడ్డి చాంబర్‌లో సీఐడీ అధికారులు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ విచారణ చేపట్టారు.

జడ్పీలో సీఐడీ విచారణ
విచారణ చేస్తున్న అధికారులు

పలు రికార్డులు, ఫైళ్లు స్వాధీనం

బోగస్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగోన్నతులు పొందిన వారిలో గుబులు

అనంతపురం విద్య, నవంబరు 26: జడ్పీ అక్రమాలపై సీఐడీ అధికారులు విచారణ చేశారు. శుక్రవారం స్థానిక జడ్పీలోని సీఈఓ భాస్కర్‌రెడ్డి చాంబర్‌లో సీఐడీ అధికారులు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ విచారణ చేపట్టారు. జిల్లా పరిషత్‌లో జరిగిన అనేక అక్రమాలపై విచారించారు. పలువురు ఏఓలను చాం బర్‌కు రప్పించారు. రికార్డులు, ఫైళ్లను  తెప్పించి, పరిశీలించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముఖ్యంగా 2020లో ఏడుగురు రికార్డు అసిస్టెంట్లకు జూనియర్‌ అసిస్టెట్లుగా ఉద్యోగోన్నతులు ఇవ్వడంలో నిబంధనలు పాటించకపోవడం, కారుణ్య నియామకాల్లోనూ అడ్డగోలుగా వ్యవహరించడంపై విచారణ చేసినట్లు తెలుస్తోంది. పలువురు ఉద్యోగులు, సంఘాల నాయకులు ముగ్గురు బోగస్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగోన్నతులు పొందారన్న అభియోగాలు, పీఎఫ్‌ విభాగాల్లో ఆర్థిక అవకతవకలపై సైతం విచారణ చేసినట్లు తెలుస్తోంది. పలు అంశాలకు సంబంధించిన అధికారులు రికార్డులు, ఫైళ్లు పరిశీలించి, ఉద్యోగులను విచారణ చేసి రికార్డు చేసుకున్నారు. సీఐడీ విచారణ నేపథ్యంలో ఫేక్‌ రాయుళ్లు, అడ్డగోలు ఉద్యోగోన్నతులు పొందిన వారిలో గుబులు మొదలైంది.

Updated Date - 2021-11-27T06:30:02+05:30 IST