Cigniti Technologies: నల్గొండ తల్లీపిల్లల ఆరోగ్య కేంద్రానికి వైద్య సామగ్రిని అందించిన సిగ్నిటీ టెక్నాలజీస్
ABN , First Publish Date - 2022-09-04T03:23:27+05:30 IST
జిల్లాలోని తల్లీపిల్లల ఆరోగ్య కేంద్రంలో ప్రసిద్ధ ఏఐ, ఐపీ ఆధారిత డిజిటల్ అస్యూరెన్స్, డిజిటల్ ఇంజినీరింగ్ సేవల
నల్గొండ: జిల్లాలోని తల్లీపిల్లల ఆరోగ్య కేంద్రంలో ప్రసిద్ధ ఏఐ, ఐపీ ఆధారిత డిజిటల్ అస్యూరెన్స్, డిజిటల్ ఇంజినీరింగ్ సేవల కంపెనీ సిగ్నిటీ టెక్నాలజీస్(Cigniti Technologies) ననజాత శిశువుల సంరక్షణ కేంద్రం (NICU), ప్రత్యేక నవజాత సంరక్షణ కేంద్రం (SNCU) సదుపాయాలను ప్రారంభించింది. ప్రభుత్వ ఆస్పత్రులలో అత్యుత్తమ మౌలిక వసతులు కల్పించాలన్న లక్ష్యంతో భాగంగా సిగ్నిటీ ఇందుకు సంబంధించిన సామగ్రిని అందించింది. సిగ్నిటీ టెక్నాలజీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీవీ సుబ్రమణ్యం దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, సిగ్నిటీ లీడర్షిప్ సాయిరామ్ వేదం, ఊర్మిలా మార్కిలి, మిథున్ పింగిళి, నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఫౌండర్, సీఈఓ మయూర్ పట్నా పాల్గొన్నారు.
ఎన్ఐసీయు/ఎస్ఎన్సీయు పడకల కొరత సమస్యను తీర్చేందుకు నిర్మాణ్ ఆర్గనైజేషన్తో సిగ్నిటీ చేతులు కలిపి రేడియంట్ వార్మర్స్, ఫోటో థెరఫీ మెషీన్స్, పల్స్ ఆక్సీమీటర్లు, సిరెంజ్, ఇన్ఫ్యూజన్ పంపులు, మల్టీ పారా మానిటర్స్, హెచ్ఎఫ్ఎన్సీ మెషీన్లు, ఎయిర్కండీషనర్లు వంటివి అందించింది. నెలలు నిండకుండా జన్మించిన, లేదంటే తీవ్ర అనారోగ్యం బారిన పడిన 28 రోజుల కంటే తక్కువ వయసున్న నవజాత శిశువుల చికిత్సలో ఇవి ఎంతో కీలకం అవుతాయి. ఈ సదుపాయాలు ఇప్పుడు జిల్లా కేంద్రంలో 14 లక్షల మంది ప్రజలతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. అంతేకాదు, ఏడాదికి 1000 మంది శిశువులకు ప్రయోజనం కలుగుతుంది.
ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచాలన్నదే తమ ప్రయత్నమని సిగ్నిటీ టెక్నాలజీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుబ్రమణ్యం అన్నారు. శిశువుల ప్రాణాలను కాపాడడంలో అత్యంత కీలకమైన వైద్య సదుపాయాలను అందించడం ద్వారా నల్గొండ ప్రజలకు తమ సహకారం మరింత అందించేందుకు కృషి చేస్తామన్నారు.