విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి
ABN , First Publish Date - 2021-08-04T05:23:05+05:30 IST
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ మంగళవారం నెల్లూరు నగరంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఆత్మకూరు బస్టాండ్, అయ్యప్పగుడి సెంటర్లో ఈ ప్రదర్శనలు చేపట్టింది.
కరోనా విపత్తులో ఆక్సిజన్ అందించింది
సీఐటీయూ నిరసన ప్రదర్శనలు
నెల్లూరు(వైద్యం), ఆగస్టు 3 : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ మంగళవారం నెల్లూరు నగరంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఆత్మకూరు బస్టాండ్, అయ్యప్పగుడి సెంటర్లో ఈ ప్రదర్శనలు చేపట్టింది. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్కుమార్, ఉపాధ్యక్షుడు మాదాల వెంకటేశ్వర్లు, నగర కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో పురుడుపోసుకున్న కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయమన్నారు. రూ.లక్ష కోట్ల విలువైన ఉక్కు పరిశ్రమను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రం యత్నిస్తోందని విమర్శించారు. కరోనా కష్టకాలంలోనూ రాష్ట్రంలోని కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించిన ఘనత విశాఖ ఉక్కుదేనన్నారు. అలాంటి పరిశ్రమను అమ్మాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మూలం రమేష్, నగర అధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, పెంచల నర్సయ్య, సూర్యనారాయణ, కొండా ప్రసాద్, సంపత్కుమార్, కిన్నెర కుమార్ తదితరులు పాల్గొన్నారు.