అమ్మకానికి ప్రభుత్వ రంగ సంస్థలు
ABN , First Publish Date - 2021-10-22T06:10:52+05:30 IST
అమ్మకానికి ప్రభుత్వ రంగ సంస్థలు
బీజేపీ వైఖరిని ఎండగట్టండి: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు
వన్టౌన్, అక్టోబరు 21: ఆరు లక్షల కోట్ల ప్రభుత్వ రంగ ఆస్తులను కార్పొరేట్లకు అమ్మేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం సిద్ధమయిందని, బీజేపీ వైఖరిని ఎండగట్టాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు అన్నారు. వన్టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద గురువారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ నిరసించాలన్నారు. ప్రతిదానినీ మానిటైజేషన్ విధానంలోకి తీసుకువస్తూ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు లీజులకు ఇస్తున్నారన్నారు. కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు ఒక్కటై బీజేపీ విధానాలను వ్యతిరేకించాలన్నారు. కార్పొరేటర్ బోయ సత్యబాబు, సీఐటీయూ పశ్చిమ నాయకులు ఎల్.మోహనరావు, ఎస్.సుబ్బారెడ్డి, చౌదరి, ఊయల కొండలు పాల్గొన్నారు.