వైసీపీది కోతల ప్రభుత్వం
ABN , First Publish Date - 2020-02-23T06:03:15+05:30 IST
కల్లబొల్లిమాటలతో అధికారం చేజిక్కించుకున్న సీఎం జగన్ ప్రభుత్వం నేడు రేషన్కార్డులు, పింఛన్లు
టీడీపీ హయాంలో అర్హులందరికి సంక్షేమ ఫలాలు
నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
నెల్లూరు(వ్యవసాయం), ఫిబ్రవరి 22 : కల్లబొల్లిమాటలతో అధికారం చేజిక్కించుకున్న సీఎం జగన్ ప్రభుత్వం నేడు రేషన్కార్డులు, పింఛన్లు తొలగిస్తూ కోతల ప్రభుత్వంగా మారిందని టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అవ్వా తాతలకు రూ.3వేలు పింఛను ఇస్తామని హామీ ఇచ్చి నేడు రూ.250లు మాత్రమే పెంచాడన్నారు. 45 ఏళ్లు దాటిన మహిళలందరికి పింఛనంటూ నవరత్నాలు పేరుతో నవమోసాలు చేస్తున్నాడని ఆరోపించారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 5 లక్షల పించన్లను తొలగించాడని, నెల్లూరు నగరంలో 7250 పింఛన్లను తొలగించాడన్నారు. 300 యూనిట్లకంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తే అమ్మఒడికి అనర్హులన్నాడని తెలిపారు. రాష్ట్రంలో 20వేల రేషన్కార్డులను రద్దు చేశాడని 6 లక్షల మంది ఆటోకార్మికులుంటే వారిలో 1,80,000ల మందికి మాత్రమే రూ.10వేలు ఇచ్చాడని ఆరోపించారు. అయితే వారి నుంచి ఫైన్ల పేరుతో తిరిగి ఆ నగదు వసూలు చేస్తున్నాడని విమర్శించారు. వైఎస్సార్ ఇచ్చిన సంక్షమ పథకాలను తాము ఎక్కడా రద్దు చేయలేదన్నారు. ఈ సమావేశంలో నాయకులు జెన్ని రమణయ్య, ఖాజావలి, ఉచ్చి భువనేశ్వరీప్రసాద్, పిట్టి సత్యనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు..