బియ్యం ఇస్తాం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?: మారెడ్డి

ABN , First Publish Date - 2021-12-06T22:15:48+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఎఫెసీఐకి బియ్యాన్ని (సీఎంఆర్) అప్పగించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సమస్యలు సృష్టిస్తోందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు

బియ్యం ఇస్తాం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?: మారెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఎఫెసీఐకి బియ్యాన్ని (సీఎంఆర్) అప్పగించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సమస్యలు సృష్టిస్తోందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తన చేతకానితనాన్ని తెలంగాణ ప్రభుత్వ వైఫల్యంగా రుద్దే ప్రయత్నం చేస్తోంది. ఇది చాలా బాధాకరమని అన్నారు. సోమవారం నాడు పౌరసరఫరాల భవన్లోని తన కార్యాలయం నుంచి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం ఇస్తామని చెప్పిన బియ్యాన్ని ఇవ్వలేదని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ పార్లమెంట్ లో చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండించారు.బియ్యం ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అంటూ ఆయన ప్రశ్నించారు.


బియ్యం నిల్వకు స్టోరేజ్ స్పేస్, వ్యాగన్ మూమెంట్ (ర్యాలు) కల్పించడంలో కేంద్రం (ఎఫెసీఐ) పూర్తిగా విఫలమైంది. ఒకవైపు తనిఖీల (ఫిజికల్ వెరిఫికేషన్), పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మిల్లింగ్ నిలిపివేస్తుంది. మరోవైపు బియ్యం నిల్వలకు అవసరమైన గోదాములను ఇవ్వడం లేదు. బియ్యం రవాణాకు అవసరమైన (ర్యాలు) ఏర్పాటు చేయడం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తనిఖీ (ఫిజికల్ వెరిఫికేషన్) చేస్తున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ దాని పేరుతో కేంద్రం సమస్యలు సృస్టిస్తోందని ఆయన ఆరోపించారు. ఒక్క జిల్లాలోని రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహిస్తే రాష్ట్రం మొత్తం మిల్లింగ్ నిలిపివేయడంలో అర్థమేమిటని ఆయన ప్రశ్నించారు.


ఫిజికల్ వెరిఫికేషన్లో ఒక నెలలో 23 రోజులు మరో నెలలో 16 రోజులు మిల్లింగ్ నిలిచి పోయింది. దీనికి తోడు డిమాండ్ మేరకు స్టోరేజ్ స్పేస్ కల్పించక పోవడం వల్ల రాష్ట్రంలో రైస్ మిల్లుల్లో, గోదాముల్లో ఎక్కడికక్కడ ధాన్యం నిల్వలు పేరుకపోయాయి. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలను మరిచి బియ్యం అప్పగించడానకి అవసరమైన గోదాములను, వ్యాగన్ మూమెంట్ ను సమకూర్చకుండా పివి (ఫిజికల్ వెరిఫికేషన్) పేరుతో సమస్యలను సృష్టిస్తోంది. బియ్యం నిల్వలకు గోదాములు అడిగితే జెమ్ పోర్టల్ లో నమోదు చేసుకుంటేనే ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు.

Updated Date - 2021-12-06T22:15:48+05:30 IST